హైదరాబాద్: ఇప్పుడు స్టార్టప్లదే కాలం. వారికి చేయూతనివ్వడమే ప్రభుత్వ కర్తవ్యం. అయితే రక్షణశాఖ ఆధ్వర్యంలో సాగుతున్న టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ను అమలు చేసేందుకు తెలంగాణ ముందుకు వచ్చింది. అత్యాధుని రక్షణరంగ ఉత్పత్తులను తయారు చేసే స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు తెలంగాణ సహకారం అందించనున్నది. టీడీఎఫ్ స్కీమ్ కింద వచ్చే నిధులను ఆయా స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు అందేలా తెలంగాణ ప్రభుత్వం సహకరించనున్నది. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక సామర్థ్య వాతావరణాన్ని నెలకొల్పాలన్న ఉద్దేశంతో టీడీఎఫ్ స్కీమ్ను తెలంగాణ సర్కార్ ప్రోత్సహిస్తోంది.
డీఆర్డీవో డైరక్టర్ నిధి బాన్సల్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. టీ-వర్క్స్, టీ-హబ్ పాల్గొన్నాయి. స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన చేయూత గురించి ఆ కార్యక్రమంలో చర్చించారు. అవసరమైన టెక్నాలజీ పరికరాలను రూపొందించే సంస్థలకు ఆ స్కీమ్ కింద సుమారు పది కోట్ల వరకు గ్రాంట్ ఇస్తారు. ఆ నిధులను స్టార్టప్లకు చేరేలా తెలంగాణ ప్రభుత్వం సహకరించనున్నది.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విశిష్ట స్కీమ్లను అర్హులకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. డీఆర్డీవో టీడీఎఫ్ లాంటి స్కీమ్ను స్టార్టప్లకు చేర్చడమే తమ లక్ష్యమన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టీ- వర్క్స్, టీ-హబ్, వీ-హబ్, రిచ్ లాంటి స్టార్టప్ వ్యవస్థలు .. రాష్ట్రాన్ని, దేశానికి వెన్నుముకగా నిలుస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
టీ-వర్క్స్ దేశంలో అతిపెద్ద స్టార్టప్ నెట్వర్క్ వ్యవస్థగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీ-వర్క్స్, టీ-హబ్తో పనిచేస్తున్న స్టార్టప్లు టీడీఎఫ్ నిధులను సమర్థవంతంగా వాడుకోవాలని డీఆర్డీవో డైరక్టర్ నిధి బన్సాల్ తెలిపారు. టీడీఎఫ్ ఫండ్లో 20 శాతాన్ని.. స్టార్టప్ సర్వీసులకు వినియోగించనున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణరంగ టెక్నాలజీని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం టీడీఎఫ్ స్కీమ్ను తీసుకువచ్చింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఏరోస్పేస్, డిఫెన్స్ డైరక్టర్, డీఆర్డీవో అడిషనల్ డైరక్టర్, 50 స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు పాల్గొన్నాయి.