మాస్కో: ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లు బాధ్యతాయుతమైన నేతలని , రెండు దేశాల మధ్య ఉన్న వివాదాలను వాళ్లు పరిష్కరించుకోగల సమర్థులని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. సైనో ఇండియా వివాదంలో మరో ప్రాంతీయ శక్తి జోక్యం చేసుకోకూడదని ఆయన అన్నారు. ఇటీవల అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో ఇండియా క్వాడ్ భేటీలో పాల్గొన్న విషయం తెలిసిందే. క్వాడ్ సమావేశాన్ని చైనా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఏ దేశాల మధ్య మిత్రత్వం ఏర్పడినా, అది మూడవ దేశాన్ని టార్గెట్ చేసినట్లుగా ఉండకూడదన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ గ్రూపు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నదని చైనా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్తో కానీ, చైనాతో కానీ తమకు భాగస్వామ్యం ఏర్పాటు విషయంలో ఎటువంటి అవాంతరాలు లేవన్నారు.
చైనా, భారత్ మధ్య కొన్ని సమస్యలు ఉన్న విషయాన్ని తాను గుర్తిస్తానని, సాధారణంగా పొరుగు దేశాలతో ఎన్నో సమస్యలు ఉంటాయని, కానీ భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యక్తిత్వాల గురించి తనకు తెలుసు అని, వాళ్లు ఇద్దరూ బాధ్యతాయుతమైన వ్యక్తులు అని, ఒకర్ని ఒకరు అమితంగా గౌరవించుకుంటారని, ఆ రెండు దేశాల మధ్య ఉన్న ఎటువంటి సమస్యనైనా వాళ్లు పరిష్కరించుకోగలరని పుతిన్ అన్నారు. కానీ ఈ సమయంలో మరో ప్రాంతీయ శక్తి ఆ వివాదాల్లోకి వెళ్లడం సరికాదన్నారు. భారత్, చైనా మధ్య లడాఖ్ ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఆ అంశంపై పుతిన్ సమాధానం ఇచ్చారు.
భారత్, రష్యా మధ్య భద్రతా, రక్షణ అంశాల్లో సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని, నమ్మకంతో ముందుకు వెళ్తే అన్నీ సాధ్యమవుతాయన్నారు. భారత్ అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తున్నానని, అవి వ్యూహాత్మక బంధాలు అని, కేవలం రష్యా ఆయుధాలను కొనుగోలు చేయడమే కాదు, భారత్తో మాకు గాఢమైన అనుబంధం ఉందని పుతిన్ తెలిపారు. రష్యా ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్న ఏకైన భాగస్వామి కూడా ఇండియానే అని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన పుతిన్.. అమెరికాతో సంబంధాలు, కరోనా మహమ్మారి, రష్యాపై యూఎస్ ఆంక్షలు, గాజా వివాదం గురించి కూడా స్పందించారు.