హైదరాబాద్ : కేరళ కొచ్చిలోని CIFNET ( Central Institute of Fisheries Nautical and Engineering Training ) ప్రవేశ పరీక్షలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ( TSWR ) విద్యార్థి మెరిశాడు. బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇంటర్ విద్య పూర్తి చేసిన కుమ్మరి అంజిత్ కుమార్.. కొచ్చిలోని CIFNET ప్రవేశం పొందాడు. రాష్ట్రం నుంచి ఎస్సీ కేటగిరి కింద తొలిసారి సీటు పొందిన విద్యార్థిగా అంజిత్ కుమార్ నిలిచాడు. నాలుగేండ్ల పాటు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీష్ సైన్స్ కోర్సును అంజిత్ అభ్యసించనున్నారు. అంజిత్ స్వస్థలం.. కోటపల్లి మండలం రోయ్యలపల్లి గ్రామం. అంజిత్ తండ్రి కౌలు రైతు. ఇంటర్లో 96 శాతం మార్కులు, టెన్త్లో 9.2 జీపీఏ సాధించాడు అంజిత్.
బుధవారం కొచ్చికి వెళ్లే ముందు అంజిత్ కుమార్ మాట్లాడుతూ.. తన అకాడమిక్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తానని చెప్పాడు. మత్స్యరంగంలో రాణించాలనుకుంటున్నాని తెలిపాడు. తమ కులానికి (నేతకాని) చెందిన విద్యార్థులు.. ఇలాంటి కోర్సులో ప్రవేశం పొందలేదు. తానే తొలి విద్యార్థిని అని అంజిత్ పేర్కొన్నాడు. తనకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందించిన బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రిన్సిపాల్ సైదులు, టీచర్లకు అంజిత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.