ఈటానగర్: అరుణాచల్ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ పరీక్షలో తెలంగాణ యువకుడు సత్తా చాటాడు. అరుణాచల్ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సర్వీస్ కమిషన్ కంబైన్డ్ పరీక్ష (APPSCCE)లో నల్లగొండకు చెందిన భోనగిరి వంశీకృష్ణ మెరిట్ లిస్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని బాలానగర్లో నివాసం ఉంటున్న వంశీ కృష్ణ 16వ స్థానంలో నిలిచాడు. దీంతో జిల్లా ల్యాండ్ రెవెన్యూ అండ్ సెటిల్మెంట్ అధికారి ఉద్యోగానికి అర్హత సాధించాడు.
ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ గతేడాది జూలైలో విడుదలైంది. నవంబర్ 4న జరిగిన పరీక్షలో 30 వేలమంది పాల్గొన్నారు. వారిలో 1500 మంది మాత్రమే మెయిన్స్కు అర్హత సాధించారు.
అందులో 141 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి, ఫైనల్ లిస్టును ఇటీవల విడుదల చేశారు. ఈ పరీక్షలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేసిఉన్నాయి. మిగతా 20 శాతం ఉద్యోగాల్లో కూడా స్థానికుల నుంచి పోటీ ఉంటుంది. ఇంత గట్టిపోటీ ఎదుర్కొన్న వంశీకృష్ణ 16వ స్థానంలో నిలిచాడు.
నల్లగొండకు చెందిన అతను జీడిమెట్లలోని టీవీఆర్ మోడల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీకాంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అనంతరం ఐజీఎన్ఓయూలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఏ కోర్సులో చేరాడు.