హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అద్భుత పురోగతితో పరుగులు తీస్తున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ‘శ్వేత విప్లవం’ దిశగా అడుగులేస్తున్నది. రైతులకు వ్యవసాయేతర ఆదాయాన్ని సమకూర్చేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి సంస్థ ద్వారా రూ.930 కోట్లతో లక్ష బర్రెలు, ఆవులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గ్రామాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలిచ్చి వీటిని ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయించాలని, లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం చోటుకల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు అధికారులు ఇప్పటికే 17,052 బర్రెలు, ఆవులను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించారు. మిగిలిన లక్ష్యాన్ని ఈ ఏడాది డిసెంబర్లోగా సాధించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ సారి లబ్ధిదారులను ఎంపిక చేయడంలో 4 డెయిరీలను భాగస్వామ్యం చేశారు. వారు సూచించిన గ్రామాల్లోని రైతులకు రుణాలు అందించాలని స్త్రీనిధి సంస్థ నిర్ణయించింది. బర్రెల కొనుగోలు నిమిత్తం విజయ డెయిరీ పరిధిలోని 1,104 గ్రామాల్లో 26,890 మందికి, కరీంనగర్ డెయిరీ పరిధిలోని 978 గ్రామాల్లో 31,023 మందికి, ములకనూరు సహకార డెయిరీ పరిధిలోని 176 గ్రామాల్లో 7,110 మందికి, నార్ముల్ డెయిరీ పరిధిలోని 564 గ్రామాల్లో 10,499 మందికి రుణాలు ఇవ్వనున్నారు. మొత్తంగా 2,822 గ్రామాల్లో 75,552 మంది రైతులకు గేదెలను అందించనున్నారు. ఈ 4 డెయిరీల పరిధిలోని గ్రామాలతోపాటుగా వాటి పరిసర గ్రామాలు, వనపర్తి, ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాల్లోని 3 వేల గ్రామాల్లో 24,448 మందికి రుణాలు ఇవ్వనున్నారు.
ఇతర రాష్ర్టాల్లోనే కొనుగోలు
బర్రెలు, ఆవులను ఇతర రాష్ర్టాల్లోనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. రాష్ట్రంలోని బర్రెలను కొనుగోలు చేస్తే అదనంగా పాల ఉత్పత్తి జరగదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించింది. బర్రెలను కొనుగోలుచేసే ప్రదేశం నుంచే వాటిని ఫొటో తీసి ఈ యాప్లో ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రదేశానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలు అందులో నమోదవుతాయి. తద్వారా వాటిని ఇతర రాష్ర్టాల్లో కొనుగోలు చేసిందీ లేనిదీ సులువుగా తెలిసిపోతుంది. ఆవులను కొనుగోలు చేసే వారు సంకరజాతి జెర్సీ ఆవులనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 10-20 లీటర్ల పాలిచ్చే ఆవులను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. బర్రెలను కొనుగోలు చేసేవారు రోజుకు కనీసం 8-10 లీటర్ల పాలిచ్చే గ్రేడెడ్ ముర్రా జాతులను కొనుగోలు చేయాలని సూచించారు.
తక్కువ వడ్డీతో రుణాలు
బర్రెలు, ఆవుల కొనుగోలుకు కేవలం 11.50% వడ్డీతో రూ.93,270 చొప్పున రుణాలను అందజేస్తున్నారు. ఇందులో పశువు కొనుగోలుకు రూ.75వేలు, మూడు నెలల దాణా ఖర్చు కింద రూ.7,200, రవాణా ఖర్చు రూ.3 వేలు, బీమా కోసం రూ.5,088 ఇస్తున్నారు. రుణం తీసుకున్నాక మూడో నెల నుంచి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.