పల్లె ప్రగతి రూ. 269.17కోట్లు
పట్టణ ప్రగతి రూ. 112.00కోట్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గ్రామాలు, పట్టణాలకు నిధుల కేటాయింపులు, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేదని ఆర్థికశాఖ తెలిపింది. బిల్లుల చెల్లింపుపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టంచేసింది. గ్రామాలు, పట్టణాలకు ప్రతినెలా క్రమం తప్పకుండా రూ.381 కోట్లు విడుదల చేస్తున్నామని శుక్రవారం వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2,487 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వస్తున్న ఆరోపణలకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. కరోనావల్ల గత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రం ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కలుగకుండా చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులను ఇతర పథకాలకు మళ్లించారని, ఆర్థిక సంఘం నిధులను ఫ్రీజ్ చేశారని, పలు పనులకు సంబంధించిన బిల్లులను పెండింగ్లో ఉంచటంవల్లనే ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారని వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
ప్రచారం: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమవరంపేట సర్పంచ్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల రూపాలయ ఖర్చుచేశారు. బిల్లులు రాకపోవటంతో ఆత్మహత్య చేసుకున్నారు.
వాస్తవం: సోమవరంపేట పంచాయతీకి ఈ నెలలో సమర్పించిన రూ.53,038 విలువైన 2 బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీకి గత ఐదేండ్లలో ప్రభుత్వం రూ.61.56 లక్షలు మంజూరుచేసింది. ఈ ఏడాదే రూ.8.66 లక్షల చెల్లింపులు జరిగాయి. సోమవరంపేట సర్పంచ్ కిడ్నీ వ్యాధి, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నారని ఈ ఏడాది మేలో రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారు. బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారని అనటం అవాస్తవం.
ప్రచారం: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో చాలా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
వాస్తవం: మండలానికి సంబంధించి ఇటీవల సమర్పించిన రూ.2.67 లక్షల చెల్లింపులు మాత్రమే ప్రాసెస్లో ఉన్నాయి. పెండింగ్ బిల్లులే లేవు. మండలానికి గత ఆర్థిక సంవత్సరంలో రూ.3.76 కోట్లు విడుదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1.61 కోట్లు చెల్లింపులు జరిగాయి.
ప్రచారం: నల్లగొండ జిల్లాకు తగినన్ని నిధులు కేటాయించడం లేదు.
వాస్తవం: జిల్లాకు పల్లె ప్రగతి కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.228.43 కోట్లు విడుదల చేసి చెల్లింపులు జరిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని స్థానిక సంస్థలకు రూ.83.16 కోట్లు విడుదలయ్యాయి.