ఊరూరా తిరుగుతూ కూరగాయలమ్ముతున్న యువకుడు
స్వయంగా రోడ్డుకు మరమ్మతులు
ఆదర్శంగా నిలుస్తున్న గోగర్ల పద్మాకర్
కౌటాల, మార్చి 19 : ఎంబీఏ చదివి కూరగాయల వ్యాపారం చేస్తూ స్వశక్తితో ముందుకు సాగుతున్నాడు మొగఢ్దగఢ్ గ్రామానికి చెందిన యువకుడు గోగర్ల పద్మాకర్. ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. కొవిడ్-19 ప్రభావంతో దాదాపు నాలుగు నెలల పాటు హైదరాబాద్లోనే ఉన్నాడు. కరోనా కారణంగా అక్కడ బతకడం కష్టమని భావించి స్వగ్రామమైన కౌటాల మండలం మొగఢ్దగఢ్ గ్రామానికి వచ్చాడు. ఇంటి వద్ద ఏం పనిచేయాలో అర్థంకాక చిన్నగా కూరగాయల వ్యాపారం మొదలు పెట్టాడు. తర్వాత ఒక మోపెడ్ కొనుక్కొని దానిపై గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు అమ్మడం ప్రారంభించాడు. కౌటాల నుంచి తుమ్మిడిహట్టి వరకు గ్రామాల్లో ప్రతిరోజూ ఉదయం తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నాడు. ఈ రోడ్డు మొత్తం గుంతలు కావడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని గమనించాడు. తానే స్వయంగా కౌటాల నుంచి తుమ్మిడిహట్టి వరకు దాదాపు 13 కిలో మీటర్ల మేర రోడ్డుపై గుంతలను పూడ్చాడు. ఒక వైపు తన వ్యాపారం చేసుకుంటూనే మరో వైపు ఇలాంటి సమాజ సేవ చేయడంతో ఈ ప్రాంత ప్రజలు అతని సేవా గుణాన్ని ప్రశంసిస్తున్నారు.
సేవ చేయడం సంతోషంగా ఉంది..
నేను ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా పనిచేశా. కరోనా లాక్డౌన్తో ఉద్యోగం పో యింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డా. సొంత గ్రామానికి వచ్చి ఏదైనా వ్యాపారం చేసుకోవాలని అనుకున్నా. కూరగాయల వ్యాపారం ప్రారంభించా. నేను వెళ్లే రోడ్డు మొత్తం గుంతలమయంగా ఉంది. వాటిని పూడ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రతిరోజూ రెండు గంటల చొప్పున గుంతల్లో మొరం పోసి పూడ్చాను. ఇప్పుడు ఈ రోడ్డు గుండా వెళ్లే ప్రతి ఒక్కరూ నన్ను గుర్తు చేసుకుంటున్నారు. నా వంతుగా ఇక ముందు కూడా సేవ చేస్తాను.