ఆర్మూర్, ఏప్రిల్ 19 : ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రభుత్వ దవాఖానల్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ దవాఖానను ‘నమస్తే నవనాథపురం’ కార్యక్రమంలో భాగంగా పరిశీలించారు. దవాఖానలో త్వరలో కొవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను ఎమ్మెల్యే వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కరోనా బాధితులు ఎంతమంది ఉన్నారని వివరాలను డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్ను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే దవాఖానలో మూడు అత్యవసర అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు. త్వరలోనే ప్రభుత్వ దవాఖానలో 300 పడకల సామర్థ్యంతో కొవిడ్ సేవలు అందుతాయని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దవాఖానలో వైద్యులు, సిబ్బంది కరోనా నిబంధనలను పాటిస్తూ రోగులు కూడా పాటించేలా అవగాహన కల్పించాలన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన పక్కన ఉన్న కూరగాయల మార్కెట్ వారసంత(అంగడిబజార్)ను కొన్ని రోజుల వరకు మూసివేయించాలని ఎమ్మెల్యే సూచించారు. హోటల్స్, టిఫిన్స్ సెంటర్స్, కిరాణాదుకాణాలు, షోరూంలలో కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు సూచించారు. ప్రభుత్వ దవాఖానతో పాటు పట్టణంలో ఉన్న ప్రైవేట్ దవాఖానల్లోనూ కరోనా బాధితులకు చికిత్స అందించాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోరారు. సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్, ఎంపీపీ పస్క నర్సయ్య, మున్సిపల్ వైస్చైర్మన్ షేక్ మున్నా, ఏసీపీ రఘు, ఆర్మూర్ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ నాగరాజు, వైద్యులు అమృత్రాంరెడ్డి, శ్రీలత, ఎస్హెచ్వో సైదేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు సుంకరి ఈశ్వరి, గంగామోహన్చక్రు, బండారి ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్, పండిత్ పవన్, ఎండి.ఫయాజ్, సుంకరి రంగన్న, రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
పంజా విసురుతున్న కరోనా మహమ్మారి
రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం