హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): 2021 సంవత్సరపు రాష్ట్ర నైపుణ్య పోటీలను సోమవారం కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ర్టానికి చెందిన అభ్యర్థులు తమ శక్తియుక్తులను ప్రదర్శించి మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు. విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక, ఉపాథి, శిక్షణ, కర్మాగారాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ రాణీకుముదిని, ఉపాధి, శిక్షణశాఖ డైరెక్టర్ కేవై నా యక్, జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఇందిరా ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
40 అంశాల్లో వర్చువల్లో పోటీలు
వివిధరంగాలకు చెందిన 40 అంశాల్లో వర్చువల్ పద్ధతిలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. రెండేండ్లకోసారి జరిగే ఈ పోటీలకు ఈసారి రాష్ట్రం నుంచి 1045 మంది పేర్లను నమోదు చేసుకోగా, అందులో 760 మంది అర్హత సాధించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన అభ్యర్థులు కోచ్చిలో జరిగే దక్షిణ ప్రాంతీయ పోటీలకు, ఆ తర్వాత బెంగళూరులో జరిగే జాతీయ పోటీలకు హాజరు కావచ్చు. జాతీయ స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన అభ్యర్థులకు షాంఘైలో నిర్వహించే ప్రపంచస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుంది.