హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై-3), ఉపాధి హామీ, గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకం కింద తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటక సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, పంచాయతీరాజ్శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కార్యాలయంలో గురువారం వినతిపత్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే రాష్ట్రంలో వివిధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యం అవుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖలకు అనేక అవార్డులు ఇచ్చి, ప్రశంసలు కురిపించిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఇందుకోసం పీఎంజీఎస్వై-3 కింద రాష్ట్రానికి 4,484 కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 2,427 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే మంజూరు చేశారని, మిగిలిన 2,060 కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేసి తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. పంచాయతీల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన రూ.72 కోట్ల మొదటి విడత గ్రాంట్ను విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. ఉపాధి హామీ అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఈ పథకం కింద నిర్మాణాలు త్వరగా పూర్తిచేయడానికి పెండింగ్లో ఉన్న లేబర్ కాంపోనెంట్ మంజూరు చేయాలని కోరారు.