తాండూరు, అక్టోబర్ 6 : సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రా్రష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రూ.221 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా రు. 221 ఎకరాల్లో రూ. 21.30 కోట్లతో చేపట్టనున్న ఇండస్ట్రియల్ పార్కు, రూ.74 కోట్లతో తాండూరు-పాత తాండూరు మార్గంలో రైల్వే వంతెన, రూ.16 కోట్లతో వరద నీరు వెళ్లేందుకు కాలువ నిర్మాణం, అంతారం సమీపంలో 12 ఎకరాల్లో రూ. 12.26 కోట్లతో ఆటోనగర్, లారీ పార్కింగ్, రూ.2 కోట్లతో బీసీ భవన్ నిర్మాణం, రూ.2 కోట్లతో హిందూముస్లింల శ్మాశనవాటికలు, రూ.2 కోట్లతో బంజారాభవన్, రూ.50 లక్షలతో క్రిస్టియన్ భవన్, రూ.కోటితో మైనార్టీ భవన్ ఏర్పాటు, రూ.1.50 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదులు, గిరిజన సంక్షేమ పాఠశాలలో రూ.5 లక్షలతో అదనపు గదుల నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
అదే విధంగా జినుగుర్తి గేటు సమీపంలో రూ.18 కోట్లతో నిర్మించిన మైనార్టీ గురుకులం, తాండూరులో రూ.30.23 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాం కుతోపాటు పలు నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మాడల్గా నిలిచిందన్నారు. గత ఉమ్మ డి ప్రభుత్వాల పాలనలో విద్య, వైద్యం రంగాలపై అంతులేని నిర్లక్ష్యం ఉండటంతో పేద, మధ్యతరగతి వారికి ఉన్నత విద్య, వైద్యం అందని ద్రాక్షగా ఉండేదన్నారు. కానీ.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత కొత్త అధ్యాయం మొదలైందన్నారు. ఎవరూ ఊహించని విధంగా విద్య, వైద్యంతోపాటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నవశకం ప్రారంభమైందని కొనియాడారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇంటింటి కీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. వాటితో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అంతేకాకుండా పాలనాసౌలభ్యం కోసం ప్రత్యేక జిల్లాలతోపాటు కొత్త మండలాల ఏర్పాటు.. తండాలను పంచాయతీలుగా మా ర్చడంతో తండాలు కూడా అభివృద్ధి పథంలో ముందున్నాయన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో ప్రభుత్వం తాండూరుకు రూ. వేల కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. తాండూరును రాష్ట్రంలోనే ఆదర్శంగా మార్చేందుకు అవసరమైన నిధులను తీసుకొస్తానని మంత్రి మహేందర్రెడ్డి హామీచ్చారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న 6 గ్యారెంటీలు ఆరిపోయే దీపాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే సముద్రంలో రాయి కట్టుకొని పడినట్లేనని పేర్కొన్నారు. రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని.. అందువల్ల రా నున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి రోహిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్, తాండూరు మున్సిప ల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ వీణ, వైస్ చైర్మన్ ఉమాశంకర్, ఎంపీపీ అనితాగౌడ్, వైస్ ఎంపీపీ స్వరూపరెడ్డి, జడ్పీటీసీమంజుల, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతం…ఆ పార్టీ పని ఖతం అంటూ సైటర్లు వేశారు. గ్యారెంటీ లేని కాంగ్రెస్ను, మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ అందరి సంక్షే మం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ర్టాభివృద్ధి ఆయనతోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి నియోజకవర్గ రూపురేఖలను మార్చుతానని హామీచ్చారు. మన రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనను.. పక్క రాష్ట్రమైన కర్ణాటక పల్లెల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు కనిపిస్తున్న పరిస్థితులను ప్రజలు ప్రత్యక్షంగా చూసి.. ఆలోచించి రానున్న ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారిని గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే అన్ని వర్గాలకు అండగా ఉన్నారని.. ఇంటింటీకీ ప్రభుత్వ పథకాలను అందించి ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి మనమందరం అండగా ఉండి రా నున్న ఎన్నికల్లో ఆయన హ్యాట్రిక్ విజయం సాధించేలా కృషి చేయాలన్నారు.