పకడ్బందీగా పోలీసుల బందోబస్తు
విస్తృతంగా తనిఖీలు
మహారాష్ట్ర నుంచి రాకపోకలు నిషేధం
నిర్మానుష్యంగా రహదారులు
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/రెబ్బెన, మే 24 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లాక్డౌన్ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, కూరగాయల మార్కెట్లను ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్య మూసివేయిస్తున్నారు. ఉదయం 10 గంటల తరువాత అకారణంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కేసులు నమోదు చేస్తు వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న వాంకిడి, సిర్పూర్(టీ)లోని వెంట్రావ్పేట్ చెక్పోస్టు వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి రాకపోకలుపూర్తిగా నిషేధించారు. జిల్లా కేంద్రంతోపాటు, కాగజ్నగర్ పట్టణాలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. రెబ్బెన మండల కేంద్రంలో లాక్డౌన్ అమలు తీరును ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర పరిశీలించారు. కొవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న గ్రామాల్లో కేసులు తగ్గేందుకు అన్ని అంశాలు పరీశీలించాలని సూచించారు. ఆయన వెంట సీఐ సతీశ్కుమార్, ఎస్ఐ భవానీసేన్, తహసీల్దార్ రియాజ్అలీ, పీహెచ్సీ డాక్టర్ భరత్ ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర తెలిపారు. ప్రతి ఒక్కరూ కఠినంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆయన వెంట అదనపు ఎస్పీ (పరిపాలన) ఎస్. శ్రీనివాస రావు, ఏఆర్ అదనపు ఎస్పీ వినోద్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్ రావు, ఉమామహేశ్వర్ రావు, సీఐలు శ్రీనివాస్, రామకృష్ణ, పురోషోత్తమాచారి, ఎస్ఐ హరిబాబు తదితరులు ఉన్నారు.