వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : తెలంగాణ రైతు సంఘం

నల్లగొండ : నూతన వ్యవసాయ చట్టాలను అదేవిధంగా రైతు ప్రయోజనాలకు తీవ్ర విఘాతంలా ఉన్న విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కేంద్రాన్ని కోరారు. నల్లగొండలో ఆదివారం జరిగిన సమావేశంలో రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో తెలంగాణ రైతులు పాల్గొననున్నట్లు చెప్పారు. కొత్తగా తీసుకువచ్చిన చట్టాల్లో కనీస మద్దతు ధర లేదన్నారు. కార్పొరేట్ వర్గాలకే లబ్ధి చేకూరేలా ఈ చట్టాలు ఉన్నాయన్నారు.
రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రం చెప్పింది. కానీ అంతకుక్రితం సంవత్సరాలతో పోల్చితే గడిచిన రెండేళ్లలో రైతుల ఆదాయం తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. భారత వ్యవసాయంపై కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని రుద్దాలని కేంద్రం చూస్తుందన్నారు. రాష్ట్రంలో 25 లక్షల వ్యవసాయ మోటార్లు ఉచిత విద్యుత్ను పొందుతున్నాయన్నారు. కేంద్రం చర్యలతో ఈ రైతాంగమంతా తీవ్రంగా నష్టపోనున్నట్లు పేర్కొన్నారు.