బెంగళూరు: కర్ణాటకలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన రేపుతున్నది. కరోనా కేసుల నమోదులో రాజధాని బెంగళూరును పది జిల్లాలు ఓవర్ టేక్ చేశాయి. ఏప్రిల్ మధ్యలో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల్లో బెంగళూరులోనే 70 శాతం ఉన్నాయి. అయితే ఈ నెల 6 నాటికి మైసూరు, తుమకూరు, కలబురగి, హసన్, బెళగావి వంటి జిల్లాల్లో కొత్త కరోనా కేసుల నమోదు 52 శాతానికి పెరిగింది. ఈ జిల్లాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన రేపుతున్నది. మరోవైపు ఈ పది జిల్లాల్లో కరోనాను ఎదుర్కొనే వైద్య సదుపాయాలు ఆ మేరకు లేవని రాష్ట్ర సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) సభ్యులు వెల్లడించారు. ఉగాదితోపాటు గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాలకు బెంగళూరు నుంచి ప్రజలు పల్లెబాట పట్టడం వల్లనే ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కరోనా విజృంభణకు కారణమని పేర్కొన్నారు.
జనతా కర్ఫ్యూ సందర్భంగా అంతర్గత రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేనందున జనం పెద్ద సంఖ్యలో బెంగళూరు నుంచి ఇతర జిల్లాలకు వెళ్లారని టీఏసీ సభ్యుడు డాక్టర్ సుదర్శన్ తెలిపారు. ప్రయాణం ఏదైనా కరోనా వ్యాప్తికి కారణమవుతుందని, ఈ నేపథ్యంలో దేశంలో ఏ ప్రాంతం కూడా కరోనా రహితంగా ఉండదన్నారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చే వారి వల్ల ఉత్తర కర్ణాటకలో, కేరళ నుంచి వచ్చిన వారి వల్ల దక్షిణ కర్ణాటకలో కరోనా కేసులు పెరిగాయని వెల్లడించారు. జిల్లాల వారీగా సలహా కమిటీలు ఏర్పాటు చేస్తే కర్ణాటకలో కరోనా పరిస్థితిని నియంత్రించ వచ్చని ఆయన సూచించారు.