మేడ్చల్/బాలానగర్, మే 17 (నమస్తే తెలంగాణ): కరోనాకు తోడు ఇప్పడు ప్రజలను బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తున్నది. ముఖ్యంగా రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతున్నది. మధుమేహం నియంత్రణలో లేనివారు కరోనా బారిన పడితే బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని ప్రభుత్వ ఆయూష్ వైద్యుడు ఆర్ శ్రీనివాస్ తెలిపారు. శరీరంలో రోగనిరోధకశక్తి ఉంటే బ్లాక్ ఫంగస్ను అడ్డుకోవచ్చని చెప్పారు. కరోనా వచ్చి తగ్గిపోయి నీరసంగా ఉన్నవారిని మాత్రమే బ్లాక్ ఫంగస్ టార్గెట్ చేస్తుందని వివరించారు. ఇది అంటువ్యాధి కాదని, లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే వెంటనే కోలుకుంటారని వెల్లడించారు. ఎక్కువకాలం ఐసీయూలో ఉండి మధుమేహం అదుపులో లేనివారితోపాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడ్డవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యాధి నిరోధకశక్తి పెంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని పేర్కొన్నారు.
వ్యాధి నిరోధకశక్తి పెంపునకు..
శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంపునకు ఆహారంలో అధిక మోతాదులో మెంతులు, కొత్తిమీర, వెల్లులి ఉండేలా చూసుకోవాలి. అయుర్వేద మందులైన శంశమినిపటి, ఆశ్వగంధ మందులను ఆయూష్ వైద్యుల సూచన మేరకు వాడుకోవాలి. శ్రావణ్ ప్రాస లేహ్యం వాడితే మధుమేహం, ఇతర వ్యాధులు అదుపులోకి వచ్చి రోగనిరోధకశక్తి పెరుగుందని వివరించారు.
బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
బ్లాక్ ఫంగస్ సోకి హైదరాబాద్ ఫతేనగర్కు చెందిన ఓ వ్యక్తి గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫతేనగర్ డివిజన్ శివశంకర్నగర్కు చెందిన గందం రాజు (45) ఇటీవల కొవిడ్ సోకడంతో ఏప్రిల్ 29న ఎర్రగడ్డలోని ఛాతి దవాఖానలో చేర్చారు. కొవిడ్ చికిత్స పొందుతుండగానే రాజుకు బ్లాక్ ఫంగస్ సోకినట్టు వైద్యులు తెలిపారు. బ్లాక్ ఫంగస్ వైద్యం కోసం ఈ నెల 13న గాంధీ దావఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం రాజు తుది శ్వాస విడిచాడు. రాజు మృతదేహానికి ఈఎస్ఐ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇందూరు, నల్లగొండల్లో ముగ్గురు..
నిజామాబాద్ జిల్లాలో సోమవారం బ్లాక్ ఫంగస్తో ఇద్దరు మరణించారు. బోధన్లోని శక్కర్నగర్కు చెంది న ఎం రాజేశ్ (39)కు ఇటీవల కొవిడ్ పాజిటివ్ రావడంతో స్థానిక దవాఖానలో చేరాడు. అక్కడి నుంచి నిజామాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 14న హైదరాబాద్లోని గాంధీకి తరలించగా.. 16న బ్లాక్ ఫంగస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. సోమవారం చికిత్స ప్రారంభించేలోపు రాజేశ్ మృతి చెందాడు. నవీపేట మండలం ఎల్కే ఫారం గ్రామానికి చెందిన హరిబాబు (36) అనే కౌలు రైతుకు పాజిటివ్ వచ్చింది. హోంఐసొలేషన్లో ఉండగా పరిస్థితి విషమించడంతో గాంధీ దవాఖానకు తరలించారు. బ్లాక్ ఫంగస్ సోకినట్టు నిర్ధారణ కాగా చికిత్స పొందు తూ మృతి చెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెంకు చెందిన వ్యక్తి(56) బ్లాక్ ఫంగస్తో మృతిచెందాడు. 25 రోజుల క్రితం అతనికి కరోనా సోకగా కోలుకున్నాడు. వారం తర్వాత మళ్లీ జ్వరంతోపాటు ఎడమ కన్ను వాపు వచ్చి కంటి చూపు కోల్పోయాడు. ఈ నెల 16న హైదరాబాద్లోని ఈఎన్టీ దవాఖానకు ఆ తర్వాత గాంధీకి తీసుకెళ్లారు. సోమవారం మృతి చెందగా డాక్టర్లు బ్లాక్ ఫంగస్తో చనిపోయినట్టు నిర్ధారించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్కు చెందిన తాళ్లపల్లి మల్లేశం అనే వ్యక్తికి పదిరోజుల క్రితం కరోనా సోకగా, ఇటీవల తగ్గిపోయిం ది. రెండు రోజులుగా తల నొప్పి, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతుండగా సోమవారం కరీంనగర్లో పరీక్షలు చేయించుకోగా, బ్లాక్ ఫంగస్ సోకినట్టు తేలింది.