ప్రతి సంక్షోభమూ ఓ కొత్త పాఠం నేర్పుతుంది. సమస్యలు ముసిరినప్పుడు అడుగులు తడబడతాయి. గమ్యం మసకబారుతుంది. ఇబ్బందులు అధిగమిస్తూ, తెలివిగా, సహనంగా ముందుకు కదిలితే మబ్బుతెరలు వీడిపోతాయి. సమస్యలకు ముకుతాడు పడుతుంది. ఒక్కో సమస్య ఒక్కో పాఠం చెప్తుంది. పరిష్కారం చూపుతుంది. కావలసిందల్లా తెలుసుకోవాలన్న తపన, నేర్చుకునే నైపుణ్యమే! ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మానవాళి ముందు అనేక ప్రశ్నలు ఉంచింది. గడచిన అనేక శతాబ్దాలుగా మానవాళిని అంటువ్యాధులు చెండుకుతింటూనే ఉన్నాయి. మిగిలినవాటితో పోలిస్తే కొవిడ్ ఆందోళనకరమైనది. ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య వాతావరణాన్ని కకావికలం చేసిన వైరస్ ఇది. అభివృద్ధి క్రమానికి ఎదురుదెబ్బ ఇది!
మునుపెన్నడూ లేని స్థాయిలో ఆరోగ్య కార్యకర్తల సేవలు, అంటువ్యాధులపై పోరాటం సాగించే సామాజిక సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయిప్పుడు. కరోనా సృష్టించే ఇబ్బందులేమిటో దాదాపుగా ఇప్పటికే తేటపడ్డాయి. దీర్ఘకాలంలో ఆరోగ్యరంగం, దేశాల అభివృద్ధి, ఉద్యోగిత, ప్రణాళికా ప్రాథమ్యాలు ఎలా మారతాయన్నది ఇంకా అంతుపట్టనిదిగానే ఉంది. పర్యావరణాన్ని ఛిద్రం చేసిన పాపం మనిషిని ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది. ఇప్పటివరకు ప్రపంచాన్ని వణికించిన ప్రతి అంటువ్యాధికీ- పర్యావరణంతో సంబంధం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో మనిషి అలక్ష్యం కారణంగా ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో కరోనా మానవాళికి తగిలిన అతి పెద్ద ఎదురుదెబ్బ. కరోనాపై ప్రజలు, ప్రభుత్వాల ఉమ్మడి కార్యాచరణ తీరే రేపటి ప్రపంచ క్రమాన్ని నిర్ణయించనున్నాయి.
కరోనా అంతుపట్టని సవాళ్లను మన ముందు నిలిపింది. ఆరోగ్య వ్యవస్థలను, విధానాలను సమూలంగా మార్చుకోక తప్పని అవసరాన్ని సృష్టించింది. ఆరోగ్యరంగంపై ప్రభుత్వ వ్యయం పెరుగాల్సి ఉన్నది. ఆధునిక వసతులు, కొత్త వైద్య పరికరాల అవసరం పడుతుంది. అంటువ్యాధులు భయపెడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజారోగ్యం తీరుతెన్నులపై నిరంతర నిఘా, పరిశీలన తప్పనిసరి. ఎక్కడ ఏ మూల ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా, దాన్ని వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యే యంత్రాంగం కావాలి. ఇప్పటికీ చాలామంది మాస్కులకు దూరంగానే ఉన్నారు. శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకుంటున్నవారు అరుదుగా తప్ప కనిపించడం లేదు. దీనిపై ప్రచార వ్యూహాలను మార్చుకోవాలి. కఠినమైన శిక్షలు విధిస్తామని హెచ్చరించడం కాకుండా, అంటువ్యాధుల నుంచి కాపాడుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తల ఆవశ్యకతను అర్థమయ్యేలా వివరించాలి. ప్రజల్లో పునరాలోచన ప్రారంభమైనప్పుడే విజయం సాధ్యపడుతుంది. సబ్బునీటితో చేతులు కడుక్కుంటే వ్యాధికారక వైరసులను, బ్యాక్టీరియాలను అంతమొందించవచ్చునన్న అవగాహన పెరగడంతో ఇప్పుడది ఒక తప్పనిసరి అలవాటుగా మారింది. ఇలాంటి వ్యాధులను నివారించాలంటే ప్రజలకు శాస్త్రీయ విషయాలను సులభశైలిలో వివరిస్తూ పోరాటం కొనసాగించాలి. ప్రభుత్వాలు, పౌరసంఘాలు క్రియాశీల పాత్ర పోషించి ప్రజల చురుకైన భాగస్వామ్యం కోసం కృషి చేయాలి.
వడ్నాల వంశీకృష్ణ యాదవ్