హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 4,009 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా, ఇతర కారణాలతో 14 మంది మరణించినట్టు సోమవారం విడుదల చేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 83 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 1,878 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 39 వేలు దాటింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రంలో రికవరీ రేటు 88.94 శాతం నుంచి 88.46 శాతానికి తగ్గింది.
జాతీయ సగటు 86.6 శాతం నుంచి 86 శాతానికి పడిపోయింది. ఆదివారం అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 705, మేడ్చల్ మల్కాజిగిరి 363, నిజామాబాద్ 360, రంగారెడ్డి 336, సంగారెడ్డి 264, జగిత్యాల 175, వరంగల్ అర్బన్ 146, కరీంనగర్ 135, మహబూబ్నగర్ 129, సిద్దిపేట 125, కామారెడ్డి 115, ఖమ్మం 113, మంచిర్యాలలో 111 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో శనివారం 1.5 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 1.39 లక్షల మంది తొలిడోస్ తీసుకోగా, 10 వేల మంది రెండో డోస్ తీసుకున్నారని ఆదివారం వైద్యారోగ్యశాఖ తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 29.52 లక్షల మందికి టీకాలు వేసినట్టు వెల్లడించింది. తొలి డోస్ తీసుకున్నవారి సంఖ్య 28 లక్షలు దాటింది.
రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు
వివరాలు ఆదివారం మొత్తం
పాజిటివ్ కేసులు 4,009 3,55,433
డిశ్చార్జి 1,878 3,14,441
మరణాలు 14 1,838
చికిత్సపొందుతున్నవారు – 39,154