హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,261 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది మరణించినట్లు ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. కరోనా నుంచి మరో 3,043 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొన్నారు. రాష్ర్టంలో కరోనా పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందన్నారు. రాష్ర్టంలో రికవరీ రేటు 99.5 శాతంగా ఉందని స్పష్టం చేశారు. బెడ్ ఆక్యుపెన్సీ రేటు 26 శాతం మాత్రమే ఉందన్నారు. 87 లక్షలకు పైగా ఇండ్లలో రెండో దశ ఫీవర్ సర్వే పూర్తి చేశామని తెలిపారు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందన్నారు. గ్రామాల్లోనూ పకడ్బందీగా లాక్డౌన్ అమలు కావాలన్నారు. గ్రామాల్లో కరోనా కేసుల తీవ్రత తగ్గించేందుకు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి అని శ్రీనివాస్ రావు సూచించారు.