భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారీ స్థాయిలో మావోయిస్టుల వస్తువులు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమాబేడా క్షేత్రాంతర్గతంలో గత మాలపారా – కాంటూర్ మధ్యగల అటవీ ప్రాంతంలో బీఎస్ఎఫ్ 17వ బెటాలియన్ భద్రతా బలగాలు, జిల్లా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తునారు.
ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులకు దిగారు. వెంటనే అప్రతమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు పారిపోయారు. కాల్పుల విరమణ అనంతరం భద్రతా బలగాల ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఘటనా స్థలంలో భారీ ఎత్తున మావోయిస్టులకు సంబంధించిన పేలుడు పదార్థాలు, ఆయుధ, వస్తు సామగ్రి స్వాధీనపరుచుకున్నట్లు ఐజీ సుందర్రాజ్ పాటిలింగ్ తెలిపారు.