హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లుచేసిందని తెలిపారు. శనివారం కోఠిలోని ప్రజారోగ్యశాఖ కార్యాలయంలో డీఎంఈ రమేశ్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. సరిహద్దు రాష్ర్టాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించడం, ఎక్కడికక్కడే నిర్ధారణ పరీక్షలుచేయడం, రాకపోకలపై నిఘా విధించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా వంటి పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. కేసులు నమోదవుతున్న కాలనీలు, మాల్స్, ఇతర వ్యాపార సముదాయాల వద్ద వైరస్ వ్యాప్తి నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పాజిటివ్ వచ్చినవారిని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని ఐసొలేషన్లో ఉంచడం, చికిత్స అందించడం వంటివి చేస్తున్నామని అన్నారు. కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే మాల్స్, కాంప్లెక్స్లు, ఇతర వ్యాపార సముదాయాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ విషయంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని కార్పొరేట్ దవాఖానలు సర్వీస్ చార్జి లేకుండా వ్యాక్సిన్ ఇవ్వడంపై అభినందనలు తెలిపారు. మరికొన్ని ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వారి లైసెన్స్ రద్దుచేస్తామని స్పష్టంచేశారు. అవకాశం ఉన్నవారు తప్పకుండా టీకా తీసుకొనేందుకు ముందుకు రావాలని కోరారు.
ముందస్తు ఏర్పాట్లుచేశాం: రమేశ్రెడ్డి
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు దవాఖానల్లో ప్రత్యేక పడకలు ఏర్పాటుచేసినట్టు డీఎంఈ రమేశ్రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న కొవిడ్ పరిస్థితులు మన రాష్ట్రంలో రావడం, రాకపోవడం అనేది మన చేతుల్లోనే ఉన్నదన్నారు. కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. వైరస్ సోకినవారు సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలని సూచించారు.
పండుగల వేళ వృద్ధులు జాగ్రత్త
వైరస్ ప్రభావం వృద్ధులు, దీర్ఘకాలిక రోగులపై ఎక్కువగా ఉంటుందని, కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని శ్రీనివాసరావు సూచించారు. ప్రస్తుత పండుగల సీజన్లో కొవిడ్ జాగ్రత్తలను విస్మరించకూడదని చెప్పారు. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, చిన్నారులను వేడుకలకు దూరంగా ఉంచడం మంచిదని సూచించారు. సెకండ్ వేవ్ వ్యాప్తి వేగం ఎక్కువగా ఉన్నదని, ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటం ఉపశమనం కలిగించే అంశం అన్నారు.