హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గ్రంథాలయాలకు గొప్ప చరిత్ర ఉం ది. ఈ ప్రాంతంలో ప్రజ్వరిల్లిన అనేక ఉద్యమాలకు ఇంధనంగా పనిచేసింది లైబ్రరీలే. అంతటి ఘనత ఉన్న గ్రంథాలయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థకు చేరాయి. స్వరాష్ట్రం ఏర్పాటుకు ముందు 25 ఏండ్లలో తెలంగాణలో ఒక్క కొత్త గ్రంథాలయాన్ని కూడా నిర్మించలేదంటే ఈ ప్రాంతం ఎంతటి వివక్షకు గురైందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గ్రంథాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రూ.896 కోట్లతో రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధి చేపట్టారు. నూతన జిల్లాలు, మండల కేంద్రాల్లో ఆధునిక వసతులతో గ్రంథాలయాలను నిర్మిస్తున్నారు. నాలుగు కొత్త జిల్లాలు మినహా అన్ని చోట్లా గ్రంథాలయాల నిర్మాణపనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2019-20 ఆర్థికసంవత్సరంలో కొత్త లైబ్రరీల నిర్మాణానికి ప్రభుత్వం రూ.58.75 కోట్లు కేటాయించింది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్ల్లో నూతన గ్రం థాలయ భవనాల నిర్మాణం జరుగుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.3.60 కోట్లు, ఆసిఫాబాద్లో రూ.1.5 కోట్లు, మంచిర్యాలలో రూ.7 కోట్లు, కామారెడ్డిలో రూ.2 కోట్లు, సిద్దిపేటలో రూ.2 కోట్లు, సికింద్రాబాద్లో రూ.3 కోట్లు, రంగారెడ్డి, వికారాబాద్లో రూ.కోటి, రంగారెడ్డి జిల్లా బడంగ్పేట కార్పొరేషన్లో రూ.4 కోట్లు, మహబూబ్నగర్లో రూ.కోటి, గద్వాలలో రూ.1.60 కోట్లు, కొత్తగూడెంలో రూ.2 కోట్లు, మహబూబాబాద్లో రూ.కోటి, పెద్దపల్లిలో రూ.కోటి, కరీంనగర్లో రూ.7 కోట్లు, యాదా ద్రి భువనగిరిలో రూ. 2 కోట్లు, వనపర్తిలో రూ.కోటి నిధులతో సకల సౌకర్యాలతో గ్రంథాలయ భవనాలు నిర్మిస్తున్నారు. సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, సికింద్రాబాద్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. కేవలం నాలుగైదు జిల్లాలోనే స్థలసేకరణ సమస్యతో పనులు జాప్యమవుతున్నాయి.
కొత్త భవనాల నిర్మాణంతోపాటు పాత గ్రంథాయాల ఆధునీకరణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. వరంగల్ప్రాంతీయ గ్రంథాలయ భవనాన్ని రూ. 2.90 కోట్లు, ఆదిలాబాద్ లైబ్రరీని రూ.45 లక్షలు ఖర్చుచేసి ఆధునీకరించారు. నిజామాబాద్లో రూ.15 లక్షలు , సంగారెడ్డిలో రూ.82 లక్షలు, నల్లగొండలో రూ.24 లక్షలు, ఖమ్మంలో రూ.46 లక్షలు, హైదరాబాద్లో రూ.3 కోట్లు, చిక్కడపల్లి గ్రంథాలయాన్ని రూ.2 కోట్లతో ఆధునీకరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు బృంద చర్చలు నిర్వహించుకొనేందుకు వీలుగా విశాలమైన కాన్ఫరెన్స్ హాళ్లు, రీడింగ్ రూములను అదనంగా నిర్మించారు. ఖమ్మంలో విశాలమైన ఏసీ రీడింగ్ హాల్ను అందుబాటులోకి తెచ్చారు. అందులో ఒకేసారి వంద మందికి పైగా కూర్చొనే సౌలభ్యం ఉంది.
ప్రస్తుతం రాష్ట్ర, కేంద్ర గ్రంథాలయం ఒకటి, వరంగల్, నిజామాబాద్లో ప్రాంతీయ గ్రంథాలయాలు, 31 జిల్లా కేంద్ర గ్రంథాలయాలు, 537 శాఖా గ్రంథాలయాలు కలిపి మొత్తం 571 లైబ్రరీలు ఉన్నాయి. ప్రతినెలా సగటును 20 లక్షల మంది పాఠకులు గ్రంథాలయాలకు వస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల మంది సభ్యత్వ పాఠకులు ఉన్నారు. అన్ని గ్రంథాలయాల్లో కలిపి 68 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో గ్రంథాలయాలన్నింటినీ డిజిటల్ ఎంపర్మెంట్ ఫౌండేషన్ (డీఈఎఫ్) సహకారంతో డిజిటలైజ్ చేస్తున్నారు. అత్యంత ప్రాచీన, ప్రాముఖ్యత కలిగిన 45 వేల పుస్తకాలను, 1977 నాటికి ఉన్న తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మరాఠి, కన్నడ భాషల ప్రధాన దినపత్రికల డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తిచేశారు. తెలుగు భాషాభిమానులు, సాహితీ ప్రియులు, కళాకారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల కోసం పుస్తకాల లభిస్తున్నాయి. సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, రైల్వే, పోస్టల్, డీఎస్సీ తదితర అన్ని పోటీపరీక్షలకు సంబంధించిన పుస్తకాలను, నోట్స్, ఇంజినీరింగ్ విద్యార్థులకు సంబంధించిన సామగ్రిని సమకూరుస్తున్నారు.
గ్రంథాలయాలు ఒకవైపు విజ్ఞాన భాండాగారాలుగానే కాకుండా సాంస్కృతిక సౌరభాలను వెదజల్లుతున్నాయి. తెలుగు మహాసభలతో ప్రారంభమైన ఈ శకం రోజురోజుకూ విస్తరిస్తున్నది. సాహితీ గోష్టులు, కవి సమ్మేళనాలతో గ్రంథాలయాలు కొత్తశోభను సంతరించుకొంటున్నాయి. తెలంగాణ వైతాళికుల ఖ్యాతిని ఎలుగెత్తి చాటుతున్నాయి. వట్టికోట అళ్వార్స్వామి, దళిత వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ, దాశరథి కృష్ణమాచార్య వంటి మహనీయుల జయంతులు, వర్ధంతులను నిర్వహిస్తూ భావి తరాలకు మార్గదర్శనం చేస్తున్నాయి. విద్యార్థులకు పోటీలను నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నాయి.