హైదరాబాద్, మే 06 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ అయి హోంఐసొలేషన్లో ఉన్నవారికోసం తెలంగాణ పోలీసులు ‘సేవా ఆహార్’ పేరిట ఉచితంగా భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీసత్యసాయి సేవాసంస్థలు, లీడ్లైఫ్ ఫౌండేషన్, స్విగ్గి, బిగ్బాస్కెట్, హోప్ ఆర్గనైజేషన్ల సంయుక్త సహకారంతో ఉచితంగా మధ్యాహ్న భోజన వితరణను ప్రారంభించారు. ప్రతిరోజూ రెండువేల మంది వరకు భోజనాలు అందజేయనున్నారు. గురువారం స్వచ్ఛంద సంస్థ ల నిర్వాహకులతో కలిసి మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి ఈ సేవలను ప్రారంభించారు.
ఉదయం 6 కల్లా వాట్సప్ చేయాలి
ఐసొలేషన్లో ఉన్నవారు ఆహారం కోసం ఉదయం 6 గంటలకు ముందే 7799616163 నంబర్కు వాట్సప్ సందేశం పంపించాలి. బాధితుడి పేరు, ఫోన్నంబర్, లొకేషన్, పాజిటివ్ వచ్చిన వివరాలు పంపాలి. ఉదయం 6 తర్వాత మెస్సే జ్ పెడితే మరుసటిరోజు భోజనం కోసమని పరిగణిస్తారు. ఒక మెస్సేజ్లో ఐదుగురికి మధ్యాహ్న భోజనం రిక్వెస్ట్ పెట్టవచ్చు. ఒక ఫోన్నంబర్ నుంచి ఐదుసార్లు మాత్రమే ఇలా భోజనం కోసం రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.. ప్రస్తుతానికి వాట్సప్ద్వారా భోజనం కోసం రిక్వెస్ట్లు తీసుకుంటున్నారు. వారంరోజుల్లో ‘సేవా ఆహార్’ పేరిట యాప్ను అందుబాటులోకి తేనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.