సిద్దిపేట టౌన్, డిసెంబర్ 24 : తెలంగాణ పోలీసు శాఖలో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిపారని.. పోలీసులు తమ పనితీరుతో దేశ వ్యాప్త గుర్తింపు పొందారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు. సిద్దిపేట పొన్నాల శివారులో రాష్ట్రంలోనే ఆదర్శంగా రూ.10 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన మోడల్ పోలీసు కన్వెన్షన్ సెంటర్ను ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, డీజీపీ మహేందర్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్లతో కలిసి శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి మహమూద్అలీ మాట్లాడుతూ సిద్దిపేటలో పోలీసు కన్వెన్షన్ సెంటర్ హైటెక్ కన్వెన్షన్ సెంటర్లాగా ఉందన్నారు. సెంటర్ను మూడు సంవత్సరాల కాలవ్యవధిలో నిర్మించాల్సి ఉండగా, కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలోనే అత్యాధునికంగా మొట్టమొదటి కన్వెన్షన్ సెంటర్ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కృషితో నిర్మించడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యం కల్పించారని, ఒకప్పుడు పోలీసులంటే భయం ఉండేదని, ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువయ్యారని తెలిపారు. మంత్రి హరీశ్రావు చొరవతో సిద్దిపేట హైటెక్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుందన్నారు. కన్వెన్షన్ సెంటర్లు, పెట్రోలు బంక్లను విరివిగా ఏర్పాటు చేసి వాటిపై వచ్చే ఆదాయాన్ని పోలీసు కుటుంబాల పిల్లల చదువు, విదేశీ విద్య తదితర వాటికి వినియోగిస్తామన్నారు.
కల సాకారమైంది..
-రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
ఇరవై ఏండ్ల ప్రజా జీవితంలో టీఎన్జీవోలు, ఉపాధ్యాయ సంఘాలు ఎందరో తమకు కావాల్సిన సంఘం భవనాలు అడిగి నిర్మిచుకున్నారని.. పగలు, రాత్రి, పండుగ పబ్బం లేకుండా కష్టపడి విధులు నిర్వర్తించే పోలీసులు తమకు ఇది కావాలని ఏనాడూ అడగలేదని, వారి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ నా కలల ప్రతిరూపమే మోడల్ పోలీసు కన్వెన్షన్ సెంటర్ అని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పోలీసులకు ఏదైనా చేయాలనే సంకల్పంతో పోలీసు కన్వెన్షన్ సెంటర్ను అత్యాధునిక హంగులు, సకలవసతులతో నిర్మించామన్నారు. కన్వెన్షన్ సెంటర్ ద్వారా వచ్చే ప్రతి పైసా పోలీసుల సంక్షేమానికే వినియోగిస్తామని స్పష్టం చేశారు. తక్కువ ధరకే వివాహాది శుభాకార్యాలు జరుపుకునేలా అన్ని వసతులను కల్పించామన్నారు. జిల్లాలో పెట్రోలు బంక్లను ఏర్పాటు చేసుకొని ఆదాయాన్ని సమకూర్చుకుందామన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పోలీసుల సంక్షేమానికి మరింత కృషి చేస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ సారథ్యంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం వేగంగా నిర్మాణమైందని, సీపీకి, కాంట్రాక్టర్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా సకల సౌకర్యాలతో కన్వెన్షన్ సెంటర్
సిద్దిపేట జిల్లా ప్రజలు అదృష్టవంతులు.. ఆరేండ్లలో జిల్లా ఊహించని విధంగా అభివృద్ధి చెందిందని సీపీ జోయల్ డెవిస్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించడంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమైందన్నారు. అనేక ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా సిద్దిపేట మారిందన్నారు. పోలీసుల సంక్షేమానికి మంత్రి హరీశ్రావు అన్ని విధాలా సహకారం అందిస్తున్నారన్నారు. పోలీసులు ప్రమాదాల బారిన పడినప్పుడు మెరుగైన వైద్య సేవలు అందేలా మంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ప్రజలు కూడా సెంటర్ సేవలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో నాయకులు బక్కి వెంకటయ్య, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.