హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): మహిళా కమిషన్కు వస్తున్న కేసుల్లో 70శాతం గృహహింసకు సంబంధించినవేనని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల కేసులు తగ్గినట్టు వెల్లడించారు. మహిళా భద్రతపై పోలీస్శాఖ చేపట్టిన చర్యలపై శనివారం డీజీపీ కార్యాలయంలో సునీతాలక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలీస్శాఖ మహిళల భద్రతకు తీసుకొంటున్న చర్యలను డీజీపీ మహేందర్రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్, రాష్ట్రస్థాయిలో ఏర్పాటుచేసిన మహిళాభద్రత విభాగం మహిళల్లో ఎంతో భరోసా నింపిందని చెప్పారు. ఆస్తి పంపకాల కేసులు మహిళాకమిషన్కు వస్తున్నాయని, వాటి దర్యాప్తునకు పోలీసుల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. సమావేశంలో మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీ స్వాతిలక్రా, హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ డీజీ శిఖాగోయల్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్, సైబరాబాద్ పోలీస్ కమిషన్ సజ్జనార్, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.