ఇగురం జెప్పే ఈరవ్వా అంటే వీని చెయ్యిడిసి వాని చెయ్యివట్టు అన్నదట. దిక్కూదివాణం లేక కొట్టుకుపోతున్న కాంగ్రెస్ ఓ గడ్డి పరకను పట్టుకొని పైకి లేద్దామనుకుంది. కానీ ఆ గడ్డిపరక గడ్డపారగా మారి కొంప ముంచుతున్నది. పచ్చపార్టీ నుంచి తెచ్చుకున్న చిచ్చరపిడుగు బయటివాళ్ల మీద వేస్తున్న బాణాలు రివర్స్ అవుతున్నాయి. అసలుకే ఎసరు తెస్తున్న కొసరు నాయకుని మీద అధిష్ఠానం గుర్రుగా ఉందట. డ్రగ్స్ వివాదంలోకి రాహుల్గాంధీని లాగడం అస్సలు మింగుడు పడడం లేదట. ఏం చేస్తున్నావే కోడలా అంటే పారబోసి ఎత్తుకుంటున్నా అత్తా అన్నట్టు శశిథరూర్ మీద చేసిన అడ్డగోలు కామెంట్స్కు సారీ చెప్పి సర్దుబాటు చేసుకున్నాడు. రాష్ట్ర నేతల వరుస ఫిర్యాదులు అదనపు తలనొప్పిగా మారాయి. ఇలా నానాటికి తీసికట్టుగా మారిన రేవంత్కు ఓ సీనియర్ నేత ఫోన్ చేసి కోతికొమ్మచ్చిలు ఇక చాలించమని కొంచెం గట్టిగానే గడ్డిపెట్టినట్టు పార్టీవర్గాల సమాచారం. ఎడాపెడా మాట్లాడి రాహుల్ మెడకే ఉచ్చు తగిలిస్తావా అని చెడామడా తగిలించాడట. తీరు మారకపోతే తీవ్ర పరిణామాలుంటాయని క్లాసు పీకినట్టు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాప్రే ఏం మాటలు?
కంపు మాటలే తమకు ఇంపు అంటుంది బండి బ్యాచి. పొద్దున లేస్తే ఎవరో ఒకరిని తిట్టాలి. ఎంత పెద్దవారిని తిడితే అంత గొప్పవాళ్లం అవుతామని వారి సెంటిమెంటు. విపక్ష రాజకీయమంటే వీరంగం వేయడమేనని నమ్ముతారు. నమ్మడమేమిటి ఆచరణలో చూపెడతారు. వారి మాటలను తిరిగి అప్పజెప్పమంటే అప్పుడప్పుడు పత్రికలే సిగ్గుపడతాయి. ఈ అడ్డూ అదుపూ లేని తీరును ప్రజలే కాదు వారి సొంత పార్టీకి చెందిన ముఖ్యనేతలు కూడా అసహించుకుంటున్నారు. ‘రాజకీయాల్లో నేను కూడా ఎప్పటి నుంచో ఉన్నా, ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించా, కానీ మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు’ అని ఓ సీనియర్ నేత వాపోయారని తెలిసింది. ‘అవేమి మాటలు… ఎటు పోతున్నాం మనం’ అని రాష్ట్ర బీజేపీ అధినేత తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారట.
పెట్రోల్ ధర పెంచి పాదయాత్రలా?
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేది వాళ్లే.. పాదయాత్రలు చేసేది వాళ్లేనా? అని జనం విసుక్కుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్రావు, రాజాసింగ్ శుక్రవారం అసెంబ్లీ వరకు చేసిన పాదయాత్రపై జనం జోకులేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు లోయర్ ట్యాంకుబండ్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి పాదయాత్రగా వారు బయలుదేరారు. ఈ యాత్రపై దారిపొడవునా వాహనదారుల పలు కామెంట్లు వినిపించాయి. కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఈ తమాషా ఏంది? అంటూ విసుక్కున్నారు. ‘మేం కూడా బండి దిగి నడకందుకోవాలని దీని అర్థమా’ అని కొందరు అన్నారు. ‘ఏం లేదు.. పొద్దుగాల మార్నింగ్ వాక్ చేయలేదట అందుకే ఇలా నడుస్తున్నారని’ ఇంకొందరు అన్నారు. …అంబేద్కర్ విగ్రహం నుంచి నడిచివచ్చి అసెంబ్లీ దగ్గరున్న గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కనీసం నివాళులు కూడా అర్పించకుండా వెళ్లడం వారికే చెల్లు అని మరికొందరు..ఇలా ఎవరికి తోచిన విధంగా వారు బీజేపీ ఎమ్మెల్యేల పాదయాత్రను విశ్లేషించారు.