హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ప్లవనామ సంవత్సరంలో వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రముఖ పండితులు బాచంపల్లి సంతోష్కుమార్ పేర్కొన్నారు. రాజు, ప్రజలు ప్రకాశంతో వెలిగిపోతారని చెప్పారు. మే తర్వాత కరోనా ప్రభావం బాగా తగ్గిపోతుందని అన్నారు. దేశంలో విదేశీ మారక నిల్వలు పెరుగుతాయని, దౌత్యపరంగా మనదేశానికి అంతర్జాతీయ మద్దతు లభిస్తుందని చెప్పారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో బాచంపల్లి సంతోష్కుమార్ ప్లవనామ సంవత్సర పంచాంగ శ్రవణంచేశారు. ఈ సంవత్సరం అంతా రాజు, ప్రజలు అద్భుతమైన ప్రకాశంతో వెలుగొందుతారని పంచాంగం చెప్తున్నదని పేర్కొన్నారు. వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు పండేందుకు సానుకూల అంశాలు కలిసి వస్తున్నాయని, ప్రజలంతా శుభ ఫలితాలు పొందుతారని వెల్లడించారు.
పాలన అద్భుతంగా సాగుతుంది
ప్లవనామ సంవత్సరానికి అధిపతి బుధుడని, అతని ఆధిపత్యంలో ఉండే ఈ ఏడాదిలో శుభాలు కలుగుతాయని చెప్పారు. నవనాయకుల విశ్లేషణ చేస్తే, కుజుడికి ఆధిపత్యం, మేష లగ్నం ఉన్నందున ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సానుకూల అంశాలు అనేకం ఉంటాయని తెలిపారు. రాష్ర్టానికి రాజైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఫిబ్రవరి 17, 1954న ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి, బుధ మహాదశ, మేశ లగ్నంలో జన్మించారని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా మేషలగ్నంతో ప్రారంభం కావడంవల్ల ఆయనకు అద్భుతంగా ఉంటుందన్నారు. కుజుడు రాజు కావడం, అష్టమ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండటంవల్ల కేసీఆర్పై కుజుడి దృష్టి ఉండి పాలన సుభిక్షంగా సాగుతుందని చెప్పారు. శని కు జుల పరస్పర వీక్షణల కారణంగా సీఎం వే గాన్ని ఇతరులు అందుకోలేకపోవచ్చన్నారు.
పొదుపుగా ఉంటే మంచిది
ప్రభుత్వ ఆదాయం బాగుంటుందని, రాష్ట్రం పురోగమిస్తుందని సంతోష్కుమార్ చెప్పారు. ఔషధ, బ్యాంకింగ్ రంగాలు వృద్ధి సాధిస్తాయని, మీడియా, పర్యాటక రంగాల్లో ఒడిదుడుకులు చోటుచేసుకొన్నా.. మంచి ఫలితాలుంటాయని తెలిపారు. పంచాయితీరాజ్, మున్సిపాలిటీ, విద్యాసంస్థలు, స్థానిక సం స్థలు, గృహనిర్మాణం తదితర రంగాలు అభివృద్ధిలో పయనిస్తాయన్నారు. పోలీసు, రక్షణ, నేర పరిశోధన రంగాలు సమర్థంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. సినీ, టీవీ రం గంలో అపశ్రుతులు చోటుచేసుకోవచ్చన్నా రు. ప్రభుత్వ ఆదాయం వృద్ధిలో ఉంటుంద ని, పాలనాపరమైన ఖర్చులు అధికమవుతాయని చెప్పారు. 12 రాశులవారు దుబారా ఖర్చులు తగ్గించుకొంటే మంచిదన్నారు.
మే తర్వాత కరోనా తగ్గుతుంది
జూలై 13 నుంచి ఆగస్టు 16 మధ్య ప్రజలు కొద్దిగా భయభ్రాంతులకు గురవుతారని బాచంపల్లి చెప్పారు. మే తర్వాత కరోనా మహమ్మారి తగ్గుతుందన్నారు. సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 20 మధ్య గురు శని కలయిక జరుగబోతున్నదని, దీనిప్రభావంతో ప్రజల్లో భయాలు ఉంటాయన్నారు. డిసెంబర్ నాలుగు నుంచి ఇరవై వరకు కాలసర్పదోషం ఉన్నందున కొన్ని అరిష్టాలు జరుగుతాయని చెప్పారు. కేంద్ర, రాష్ర్టాల మధ్య సయోధ్య, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగుళూ రు, మద్రాసు, ఢిల్లీ నగరాల్లో పెనుగాలులతో కుంభవృష్టి కురిసే ఆస్కారం ఉన్నదన్నారు.
ఇది మహిళల సంవత్సరం
దేశంలో విదేశీమారక నిల్వ పెరుగుతుందని, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుతాయని సంతోష్కుమార్ చెప్పారు. న్యాయవ్యవస్థ కొన్ని కీలకమైన తీర్పులను వెలువరించే అవకాశమున్నదని తెలిపారు. ప్లవనామ సంవత్సరం మహిళా సంవత్సరంగా చెప్పొచ్చని, స్త్రీల ఆధిపత్యం పెరుగుతుందని తెలిపారు. రియల్ ఎస్టేట్రంగం కుజుడికి ఆధిపత్యం రావడంవల్ల వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది సింధూనది పుష్కరాలు నవంబర్ 21నుంచి డిసెంబర్ 2 వరకు జరుగుతాయని తెలిపారు.
చీకటి నుంచి వెలుగులోకి పయనం
బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన దినమే ఉగాదని. ఈ సృష్టి ఆరంభమై ఇప్పటికి 195,58,85,122వ సంవత్సరంగా శార్వరిని దాటి ప్లవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టామని బాచంపల్లి పేర్కొన్నారు. పం చాంగ పఠనం అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్లవనామ సంవత్సరం పంచాంగం-2021ను ఆవిష్కరించా రు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు సముద్రాల వేణుగోపాలాచారి, ముథోల్ శాసనసభ్యుడు విఠల్రెడ్డి, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రిలో ఉగాది ఉత్సవాలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో మంగళవారం ప్లవనామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను వైభవంగా నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో ఆస్థానపరంగానే వేడుకలను జరిపారు. స్వామివారిని ఆస్థానం చేసి, చక్రవర్తి కీరిటం, అమ్మవారికి మహాలక్ష్మీహారం, స్వర్ణభరణాలు, నూతన వస్ర్తాలను ధరింపజేసి ఆస్థాన సిద్ధాంతి, పంచాగం రంచించిన సిద్ధాంతి పంచాగ శ్రవణం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశికధర్మకర్త బి నరసింహమూర్తి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సింగపూర్లో ఉగాది సంబురాలు
సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వ ర్యంలో మంగళవారం ఉగాది సంబురాలు ఘనంగా నిర్వహించారు. మన పండుగలను నిర్వహిస్తూ భావితరాలకు పండుగల ప్రాము ఖ్యతను తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. సంబురాల్లో భాగంగా పంచాంగ శ్రవణం ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు.
భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకా రం చుట్టారు. ఉదయం మూలవిరాట్లు, ఉత్సవమూర్తులకు, కల్యాణమూర్తులకు అభిషేక తిరువంజనం జరిపారు. ప్రత్యేక పూజల అనంతరం వేప పువ్వు ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 వరకు నిర్వహించనున్నారు. ఈనెల 21న శ్రీరామనవమి, 22న మహాపట్టాభిషేకం జరుపుతారు. లక్ష లడ్డూలు, వంద క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను దే వస్థానం అధికారులు సిద్ధం చేస్తున్నారు.