హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు లక్షల మందికిపైగా ప్రైవేటు స్కూ ల్ టీచర్లు, సిబ్బందికి రెండునెలల సాయాన్ని విజయవంతంగా అందజేసినట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. 2 వేల నగదుతోపాటు 25 కిలోల బియ్యాన్ని లబ్ధిదారులందరికీ అందజేశామని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆపత్కాల సాయానికి 2,04,743 మంది లబ్ధిదారులను ఎంపికచేయగా.. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన దాదాపు రూ.81.90కోట్ల నగదు, రూ.38.77 కోట్ల విలువైన 10,237 టన్నుల బియ్యాన్ని అందజేశామని చెప్పారు. కరోనా కారణంగా పాఠశాలల మూసివేతతో ప్రైవేటు టీచర్లకు సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతినెలా రూ.40.94 కోట్ల నగదుతోపాటు రూ.19.38 కోట్ల విలువైన 5,118 టన్నుల బియ్యాన్ని అందజేస్తామని సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు.