హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 8.31 లక్షలకు చేరింది. వీరంతా కరోనా బారినపడే పరిస్థితి నుంచి 80 శాతం తప్పించుకున్నట్టేనని వైద్యనిపుణులు చెప్తున్నారు. రాష్ట్రం లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ముందుగా ఆరోగ్యసిబ్బందికి, ఆ తర్వాత ఫ్రంట్లైన్ వారియర్లు, అనంతరం 45 ఏండ్లు పైబడినవారికి టీకా వేసే ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా 1.82 లక్షల ఆరోగ్యసిబ్బంది, 83 వేల ఫ్రంట్లైన్ వారియర్లు, 45 ఏండ్లు పైబడినవారు 5.65 లక్షల మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. మొత్తంగా 8.31 లక్షల మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తయింది. వ్యాక్సిన్ తయారీ కంపెనీల ప్రకా రం.. దాదాపు 75- 80 శాతంవరకు వ్యాక్సిన్ల సామర్థ్యం ఉన్నది. రెండు డోసులు తీసుకున్నవారికి ఈ రక్షణ లభిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న ప్పటికీ మాస్కు ధరించడం, భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
43 లక్షల మంది తొలిడోస్
రాష్ట్రంలో తొలిడోస్ తీసుకున్నవారు 43 లక్షల మంది ఉన్నారు. మరో 20 రోజుల్లో వీరిలో 60 శాతం పైగా రెండోడోస్ తీసుకోబోతున్నారు. ఇది పూర్తయితే టీకా రెండుడోసులు తీసుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రంలో రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగలిగే సామర్థ్యం ఆరోగ్యశాఖకు ఉన్నది. కేంద్రం నుంచి వ్యాక్సిన్లు సకాలంలో రాకపోవడంతో రోజుకు లక్ష మందికి కూడా టీకా వేసే పరిస్థితి లేకుండా పోతున్నది. వ్యాక్సినేషన్ ప్రారంభమై దాదాపు 3 నెలలు గడుస్తున్నప్పటికీ అనుకున్న ల క్ష్యం నెరవేరడం లేదు. వ్యాక్సిన్ల కొరత కారణంగా కేవలం రెండోడోస్ వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొదటిడోస్ తీసుకోవాలనుకొనేవారికి ఎదురు చూపులే మిగులుతున్నాయి. ఆదివారం రెండోడోస్ టీకాను 81 వేల మందికి వేసినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
4 లక్షల డోసులకు ఆర్డర్
18 ఏండ్లు పైబడినవారికి టీకా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తున్నది. కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం, కేంద్రానికి, రాష్ర్టాల మధ్య పంపిణీ శాతాలను అనుసరించి వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇస్తున్నది. ఇందులో భాగంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కంపెనీలకు మొత్తం 4 లక్షల డోసుల కోసం ప్రభుత్వం ఆర్డర్ పెట్టినట్టు తెలిసింది. దీని కోసం రెండు కంపెనీలకు కలిపి రూ.14 కోట్లు చెల్లించినట్టు సమాచారం. విడతలవారీగా, ఆయా కంపెనీల ఉత్పత్తిని అనుసరించి రాష్ట్ర ప్రజల కోసం పెద్దమొత్తంలో టీకాలను సమీకరించుకొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.