హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఔషధం ‘2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్’ (2-డీజీ) పేరుతో వస్తున్న తప్పుడు మెసేజ్లు, నకిలీ ఉత్పత్తులను నమ్మొద్దని ఈ ఔషధాన్ని ఉత్పత్తిచేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సూచించింది. ఈమందును ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదని ప్రకటించింది. 2 డీజీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. మనదేశంలో ప్రజలంతా దీనికోసం కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 17న లాంఛనంగా దీనిని విడుదలచేశారు. దాంతో కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు ‘2 డీజీ’ కోసం ఆన్లైన్లో, ఆఫ్లైన్లో వెతుకుతున్నారు. ఇదే అదనుగా చేసుకొని కొందరు కేటుగాళ్లు 2 డీజీ మందు లభిస్తుందంటూ నకిలీ మెసేజ్లు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ ప్రకటనచేసింది. 2 డీజీని ఇంకా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయలేదని స్పష్టంచేసింది. ప్రస్తుతం ఎంపిక చేసిన ఎయిమ్స్ దవాఖానలు, మిలిటరీ దవాఖానలు, కొన్ని ప్రభుత్వ దవాఖానలకు మాత్రమే ఈ ప్యాకెట్లను పంపిణీ చేసినట్టు వెల్లడించింది. జూన్ రెండో వారంలో వీటిని బహిరంగ మార్కెట్లో విడుదల చేస్తామని పేర్కొన్నది. అప్పుడు నేరుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు సరఫరా చేయనున్నట్టు తెలిపింది. ఈ ప్యాకెట్ల ధరను ఇప్పటివరకు ఖరారు చేయలేదని రెడ్డీస్ ల్యాబ్స్ వెల్లడించింది. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది.ప్రజలకు ఏవైనా అనుమానాలుంటే 2dg@drreddys.com మెయిల్ ఐడీని సంప్రదించాలని సూచించింది. 2 డీజీ ఔషధంపై సర్వత్రా ఆసక్తి నెలకొనడంతో కొందరు మోసగాళ్లు ఈ డ్రగ్ అమ్ముతామంటూ రెడ్డీస్ ల్యాబ్స్కు చెందిన ఇద్దరు సిబ్బంది మెయిల్ ఐడీలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదంతా అసత్యమని, ఒకవేళ మార్కెట్లో అలాంటివి కనిపిస్తే అవి కచ్చితంగా నకిలీవేనని స్పష్టంచేసింది.