శ్రీనగర్: పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్లైన్స్ (పీఐఏ) పేరుతో విమానాన్ని పోలిన ఒక బెలూన్ కలకలం రేపింది. ఆకుపచ్చ, తెలుసు రంగులతో పీఐఏ పేరుతో అచ్చం ఆ దేశ విమానం మాదిరిగా ఉన్న గాలి బూర జమ్ముకశ్మీర్లో మంగళవారం సాయంత్రం కనిపించింది. హిరానగర్ సెక్టార్లోని సోత్రా చక్ గ్రామంలో అది ల్యాండ్ అయ్యింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాజ్బాగ్ పోలీసులు అక్కడకు వచ్చి ఆ బెలూన్ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు పాక్ విమానం మాదిరిగా ఉన్న ఈ బెలూన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పాకిస్థాన్ ఏవియేషన్ టెక్నాలజీ 2021 పేరుతో దీనిని మ్యూజియంలో భద్రపరచాలని ఒకరు, దీనిపై ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని మరొకరు వ్యాఖ్యానించారు. అది నా కుమారుడు ఆడుకుంటున్న బెలూన్, అతడికి తిరిగి ఇవ్వండి అని మరొకరు చమత్కరించారు. చాలా మంది నవ్వుల ఇమోజీలతో బదులిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.