హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కోర్టు కేసుల విచారణ నేపథ్యంలో ఈనెల 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అత్యవసర మీటింగ్కు రాలేమని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం లేఖ రాశారు. 9వ తేదీన తెలంగాణ సాగునీటి అధికారులు రెండు కోర్టు కేసులకు హాజరు కావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఎన్జీటీతోపాటు, సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో బోర్డు మీటింగ్ హాజరుకావడం అసాధ్యమని స్పష్టంచేశారు. జీఆర్ఎంబీకి కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ తెలంగాణ ఈఎన్సీ గురువారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖలపై బోర్డులు స్పందించాయి. ఎలాగైనా బోర్డులు నిర్వహించే ఉమ్మడి మీటింగ్కు హాజరుకావాలని తెలంగాణకు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్కు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు లేఖ రాశారు. బోర్డుల కార్యకలాపాలను కొనసాగించేందుకు 30 రోజుల్లోగా సరైన వ్యవస్థను ఏర్పాటుచేయాల్సి ఉన్నదని, జూలై 15న విడుదల చేసిన గెజిట్లో దీనిని కేంద్రం స్పష్టం చేసిందని, ఈ విషయాన్ని ఇప్పటికే తెలిపామని వివరించారు. నిర్ణీత గడువులోగా పనిని పూర్తిచేయాల్సి ఉన్నందున వీలుచేసుకుని బోర్డుల ఉమ్మడి సమావేశానికి తప్పక హాజరుకావాలని కోరారు.