పదవుల్లో ఉన్నా, లేకున్నా పేదలకు ఆపన్నహస్తం
వైద్యసేవల్లో సాయం.. కష్టాల్లో అభయం
గల్ఫ్ బాధిత కుటుంబాల కన్నీరు తుడుస్తున్న కవిత
రాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన లీడర్
ఆమె కృషితో అంతర్జాతీయ వేదికలపై బతుకమ్మ వైభవం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రగతిలో తనదైన ముద్ర
నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం
నిజామాబాద్, మార్చి 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆకలిగా ఉన్నవారికి గుప్పెడు అన్నం… ఆపదలో ఉన్నవారికి కొంచెం సాయం… బాధలో ఉన్నవారికి ఓదార్పు… ఏ దిక్కూ లేని వారికి దిక్సూచిగా నిలవడమే నిజమైన మానవత్వం. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్క వారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకరు. కష్టం ఉందని ట్వీట్ చేసినా… సాయం చేయాలంటూ అర్జీ పెట్టుకున్నా వెంటనే స్పందించే గుణం ఆమె సొంతం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి జైలుకెళ్లిన ధీర త్వం. బతుకమ్మ ఆటపాటలతో సాంస్కృతిక ఉద్యమాన్ని సమాంతరంగా నడిపి మహిళల సత్తాను చాటిన గొప్పతనం. దేశం నలుమూలలా అనేక వేదికలపై గళం విప్పి ఔరా అనిపించిన నైపుణ్యం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగ పాఠవం.
ఏ అంశమైనా అలవోకగా అనర్గళంగా మాట్లాడే సత్తా కలిగిన విలక్షణ వ్యక్తిత్వం. బతుకమ్మ ఆటపాటలతో ఖండాంతరాలకు తెలంగాణ సంప్రదాయాన్ని వ్యాప్తి చేసి ఖ్యాతికెక్కిన సందర్భం. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండడమే నైజంగా పెట్టుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.
సాంస్కృతిక ఉద్యమం…
పువ్వులను పూజించే విశిష్ట సంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా… విడదీయలేని ఉద్యమ రూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకే చెల్లింది. దేశ, విదేశాల్లో తెలంగాణ ఆడబిడ్డలు ఈ రోజు సగర్వంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి ప్రధాన కారణం కవితనే కావడం విశేషం. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా చేసిన పోరాటమే ప్రధాన కారణం. నాటి సమైక్య పాలకులు ట్యాంక్బండ్పై బతుకమ్మను నిషేధించి తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే… హైకోర్టుకు వెళ్లి మరీ బతుకమ్మను సంబురంగా ఆడిన ఘన చరిత్ర జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కింది. సిరిసిల్ల నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్న బతుకమ్మ చీరెలకు ప్రేరణ కూడా తెలంగాణ జాగృతి కావడం విశేషం. తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండుగ బతుకమ్మను ఉద్యమ రూపకంగా మార్చి ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఘనత కవితకే దక్కింది. రాష్ట్ర సాధనలో కల్వకుంట్ల కవిత పాత్రను మరువలేం. మహిళా లోకానికి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కల్పించారు. మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె, సడక్ బంద్, వంటావార్పు, రైల్ రోకో… ఇలా ఏ పిలుపైనా తెలంగాణ జాగృతి ద్వారా కవిత ముందుండి పోరాటం చేశారు. అనేక కేసులను ఎదుర్కొన్నారు.
ఉత్తమ పార్లమెంటేరియన్గా..
తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా లోక్సభ సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ఘనత సాధించారు. 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహించారు. 2018 సంవత్సరానికి గాను ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికయ్యారు. పార్లమెంట్లో వివిధ అంశాలపై తన వాయిస్ను వినిపించి దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడడం ఆమె ప్రత్యేకత. మహిళా సాధికారతపై విశేషంగా కృషి చేశారు. ఎంపీగా 15లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా నిలిచారు. పెద్ద బాధ్యతను నిర్వర్తించి నిజామాబాద్, జగిత్యాల జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారు. పసుపు రైతుల చిరకాల కోరిక బోర్డు సమస్యపై ఢిల్లీ వేదికగా నినదించారు. మహిళా సాధికారతపై స్పందించారు. దేశ, విదేశాల్లో అంతర్జాతీయ వేదికలపై గళం వినిపించారు. బీడీ కార్మికులకు పింఛన్ వచ్చేలా కృషి చేశారు. హైకోర్టు సాధనలో లోక్సభలో ముందుడి పోరాటం చేశారు. దేశ చరిత్రలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉమెన్ విభాగం ఆధ్వర్యంలోని ఎంపీల బృందాన్ని కవిత లీడ్ చేశారు. కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్ గ్రూపులో సభ్యురాలిగా పని చేశారు. 2014 పార్లమెంట్ తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంతో అదే అంశాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు కవిత. కశ్మీర్ పండిట్ల అంశంపై చేసిన ప్రసంగం యావత్ దేశం మెచ్చింది.