జమ్మికుంట, అక్టోబర్ 12 : ఏండేండ్లు మంత్రిగా పని చేసిన ఈటల ఏనాడూ బీసీలను పట్టించుకోలేదని, బీసీలను ఏటీఎంలా వాడుకొని మోసం చేశాడని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈటలది అగ్రవర్ణ స్వభావమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం, అంబేద్కర్ కాలనీల్లో పర్యటించి, దళితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసమే న్యాయ పోరాటాలు చేస్తానని చెప్పిన ఈటల.. నిత్యం అదే వర్గాలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తున్న మనువాద బీజేపీలో ఎలా చేరారని ప్రశ్నించారు. రాజేందర్రెడ్డిగా హైదరాబాద్లో తిరుగుతూ.. ఇక్కడి వస్తేనే బీసీగా చెలామణి అవడాన్ని ఎండగట్టారు. ‘మంత్రిగా ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడారా?.. ఇప్పుడు ఎందుకు బీసీ కార్డును వాడుకుంటున్నారు’ అని నిలదీశారు. రెడ్డి పేరు వాడుకుంటూ.. బీసీగా కొనసాగడాన్ని తప్పుబట్టారు. మంత్రి పదవి పోగానే బీసీలు గుర్తుకొచ్చారా? అంటూ మండిపడ్డారు. మనువాద ముసుగులో మీ న్యాయ పోరాటం ఎవరి కోసం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ కల్లబొల్లి మాటలు వినే స్థితిలో బీసీలు లేరని చెప్పారు. ఉప ఎన్నికలో బీసీలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తునికి వసంత్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలుకపల్లి కుమార్, జిల్లా అధ్యక్షుడు కొడెపాక సారంగం తదితరులు పాల్గొన్నారు.