కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
వికారాబాద్, తాండూరులో దవాఖానల పరిశీలన
వ్యాక్సినేషన్, కొవిడ్ పరీక్షలపై ఆరా
వికారాబాద్, మే 9: జిల్లా కేంద్రంలో త్వరలో ఆర్టీపీసీఆర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. పట్టణంలోని రాజీవ్నగర్కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన వంద పడకల దవాఖానను ఆదివారం ఆమె స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, విద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ నాగేందర్గౌడ్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, కలెక్టర్ పౌసుమి బసుతో కలసి సందర్శించారు. వ్యాక్సినేషన్, కొవిడ్ పరీక్షలపై స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాక్సినేషన్ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ దవాఖానలో త్వరలో ఆర్టీపీసీఆర్ కేంద్రం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రజలు కరోనాపై ఆందోళన చెందకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. వికారాబాద్లోనూ కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, మాజీ జడ్పీటీసీ ముత్తహర్ షరీఫ్, టీఆర్ఎస్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాండూరులో ఐసొలేషన్ కేంద్రం పరిశీలన..
తాండూరు, మే 9: తాండూరు మాతాశిశు దవాఖానలో కరోనా రోగుల కోసం సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్ను ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు కొవిడ్ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అధికారులు, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. ఇక్కడి ఐసొలేషన్ కేంద్రంలో మహిళలు, పురుషులు, చిన్నారులకు వేర్వేరుగా కరోనా చికిత్సలు నిర్వహించేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెంటర్లో 75 ఆక్సిజన్ బెడ్లు, 15 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 18 మంది వైద్యులు, 19 మంది నర్సులతో 24 గంటలూ వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో కొవిడ్ హెల్ప్ లైన్ కోసం 18005996863 నంబర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలన్నారు. జిల్లాలో ఇంటింటా జ్వర సర్వే వేగంగా జరుగుతుందన్నారు. జిల్లాలోని 2.20 లక్షల నివాస గృహాలను సర్వే చేయగా.. 6500 మందికి జ్వరం, దగ్గు తదితర లక్షణాలు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారన్నారు. వారందరికి మెడికల్ కిట్లు అందజేసి ప్రతి రోజు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. జిల్లాలో 45 వేల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండో డోస్ టీకా ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని, త్వరలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, కౌన్సిలర్లు, వైద్యులు పాల్గొన్నారు.