విక్రయిస్తే కఠిన చర్యలు
కట్టడికి టాస్క్ఫోర్స్
సమాచారాన్ని 72888 94110కు ఇవ్వాలి
కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి జంక్షన్, మే 12: జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్ ప్రసాద్తో బుధవారం సమావేశమయ్యారు. వానకాలం సీజన్లో 2,90,000 ఎకరాల్లో పంట సాగు అంచనా కాగా, ఇందులో 2.05 లక్షల ఎకరాల్లో వరి, 76,000 ఎకరాల్లో పత్తి సాగు అయ్యే అవకాశముందని డీఏవో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పంటల దిగుబడి ముఖ్యంగా విత్తనాలపై ఆధారపడి ఉం టుందని సూచించారు. హెచ్టీ పత్తి విత్తనాలకు ప్రభుత్వ అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. విత్తనాలు ఇతర రాష్ర్టాలు, పక్క జిల్లాల నుంచి వచ్చే అవకాశముందని వివరించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి, నాణ్యత లేని విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు జిల్లాస్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.
డీఏవో, పోలీస్ అధికారి, విత్తన ధ్రువీకరణ అధికారి సభ్యులుగా ఉంటారని వివరించారు. నకిలీ విత్తనాల విక్రయాలపై దాడులు చేసి, క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే వ్యవసాయశాఖ అధికారులు అంతర్గత తనిఖీ టీమ్లు ఏర్పాటు చేసి విత్తనాల దుకాణాలను పరిశీలిస్తూ, నకిలీలను నియంత్రించాలని ఆమె సూచించారు. నిబంధనలు పాటించని విత్తన డీలర్లపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొన్న వెంటనే రసీదు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలపై సమాచారముంటే 7288894110కు సమాచారం ఇవ్వాలని కోరారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని కలెక్టర్ తెలిపారు.