హైదరాబాద్, ఏప్రిల్ 1 : దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారాల్లో భాగంగా రాష్ట్రానికి 12 అవార్డులు లభించడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకకర్ రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావులను కేటీఆర్ సన్మానించి, అభినందించారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్తో ఎర్రబెల్లి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో అభివృద్ధి సాధించిన పంచాయతీలకు అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అవార్డులు వచ్చేలా కష్టపడి పనిచేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సహా ప్రతి ఒక్కరినీ కేటీఆర్ అభినందించారు.
సీఎం కేసీఆర్ వినూత్నంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ప్రతి నెల ఇస్తున్న రూ.308 కోట్ల నిధులు గ్రామాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా అసలైన గ్రామ స్వరాజ్య స్థాపన.. సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతుందని కొనియాడారు. పల్లె ప్రగతితో తెలంగాణలో గ్రామ పంచాయతీల రూపురేఖలు మారిపోయాయన్నారు.
ఇప్పుడు గ్రామాలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు వచ్చాయని.. నర్సరీలు, డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు ఏర్పడ్డాయన్నారు. నిత్యం పారిశుద్ధ్యం జరుగుతుండటంతో గ్రామాలు అద్దాల్లా తయారయ్యాని అన్నారు. దీనివల్ల గ్రామాల్లో కరోనా వ్యాప్తి తగ్గడమే కాకుండా అంటు, సీజనల్ వ్యాధుల జాడలేకుండా పోయినందని చెప్పారు. ఇదే తరహా పనితీరు కొనసాగిస్తూ.. రాష్ట్రానికి మరింత పేరు తీసుకొచ్చేలా పనిచేయాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి