హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఈ-సేవ, మీ-సేవకు దగ్గరి పోలికలు ఉండే పేర్లతో ప్రకటనలు జారీ చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నట్టు మీ-సేవ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ‘టీ-సేవ కేంద్రాస్’కు దరఖాస్తులు చేసుకోవాలంటూ పత్రికల్లో ప్రకటనలు రావటం తమ దృష్టికి వచ్చిందని, ఆ పేరుతో వస్తున్న ప్రకటనలు ప్రైవేటువేనని వెల్లడించారు. టీ-సేవ కేంద్రాలకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఈ-సేవ, మీ-సేవ మాత్రమే ప్రభుత్వ సేవలు అని స్పష్టం చేశారు. ‘సేవ’ పేరును ఉపయోగించి నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇలాంటి సెంటర్లతో మీ-సేవకు సంబంధం ఉందా? అసలు అవి ప్రభుత్వ అధీకృత కేంద్రాలేనా? అని తమకు ఫోన్లు చేసి అడుగుతున్నారని అన్నారు. ‘సేవ’ల పేరుతో వస్తున్న ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.