వరంగల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈజీఎస్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం 30శాతం వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగులు హన్మకొండలోని ఆర్ఎండీబీ అతిథి గృహంలో ఇవాళ మంత్రి దయాకర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు.
రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నా ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్ 30 శాతం వేతనాలు పెంచారని గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. ఉపాధిహామీ పథకం అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రావు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయకుమార్, టెక్నీకల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, అటెండర్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతం తదితరులు పాల్గొన్నారు.