పెద్దపల్లి : పచ్చదనం పెంపొందించే దిశగా మొక్కలు నాటడంలో దేశానికే తెలంగాణ స్పూర్తిగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని రామగుండంలోని అబ్దుల్ కలాం స్టేడియం ఆవరణలో సింగరేణీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గోదావరిఖనిలోని రామాలయం మందిరంలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి కొప్పుల, ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 8 ఇంక్లైన్ కాలనీలో మొక్కలు నాటారు. అబ్దుల్ కలాం స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రస్తుతం ఎవరు చేయనంత పెద్దగా గత 7 సంవత్సరాలలో మొత్తం 230 కోట్ల మొక్కలను తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద నాటడం జరిగిందని తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరిని భాగస్వామ్యం చేసే దిశగా నాలుగేళ్ల క్రితం ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుత విజయాన్నీ సాధించిందన్నారు. ప్రియతమ నాయకుడు కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా 10 లక్షల మొక్కలు నాటుతున్నామని మంత్రి తెలిపారు.
ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గత సంవత్సరం మంత్రి కేటిఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి 75 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. ప్రస్తుతం 3 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతున్నారని, నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత సైతం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ దామోదర్, టీఎస్టీఎస్ చైర్మన్ రాకేష్, జడ్పీ చైర్మన్ పుట్టమధు, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, రామగుండం ఎమ్మేల్యే కోరుకంటి చందర్, రామగుండం మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ సింగ్, సింగరేణీ డైరెక్టర్ బలరాం నాయక్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.