నేషనల్ వాటర్ మిషన్ పురస్కారం జాబితాలో రాష్ట్రం
హైదరాబాద్, సెప్టెంబర్13 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ ఏటా అందించే నేషనల్ వాటర్ మిషన్ పురస్కారాన్ని అందుకునే దిశగా తెలంగాణ దూసుకుపోతున్నది. బెస్ట్ స్టేట్ అవార్డు కోసం కేంద్రం నిర్దేశించిన అన్ని అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో నామినేషన్ను దాఖలు చేసింది. మొత్తంగా ఈ అవార్డు కోసం 20 రాష్ర్టాలు నామినేషన్లు దాఖలు చేయగా ఆరింటికి తుదిజాబితాలో చోటు దక్కింది. ఇందులో తెలంగాణతో సహా తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మాత్రమే మిగిలాయి. అవార్డు ఎంపిక కోసం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి వాస్తవ నివేదికను అందించాలని ఆయా రాష్ర్టాల్లోని సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజినీర్లను కేంద్ర జల్శక్తిశాఖ ఇటీవల ఆదేశించింది. అందు లో భాగంగా హైదరాబాద్లోని సీడబ్ల్యూసీ అధికారులు గత శుక్రవారం క్షేత్రపర్యటనకు వెళ్లి మిషన్ కాకతీయ చెరువులు, చెక్డ్యామ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయకసాగర్, పంప్హౌజ్లను, నిజామాబాద్లో అమలవుతున్న పైపుల సాగునీటి వ్యవస్థలను పరిశీలించారు. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ అధికారులతో సీడబ్ల్యూసీ అధికారులు సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని ఈఎన్సీ మురళీధర్ సీడబ్ల్యూసీ అధికారులకు వివరించారు.