లాక్డౌన్ నిబంధనలు బేఖాతరు
అవసరం లేకున్నా రోడ్లపైకి కొందరు
పోయిపోయి కరోనా కోరలకు..
ప్రభుత్వం, పోలీసులు వారిస్తున్నా వినరు..
వరంగల్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారి అందరినీ వణికిస్తున్నది. రెండో దశలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నది. ఎప్పుడు ఎలా వ్యాపిస్తుందో తెలియని భయం నెలకొంది. వైరస్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టింది. పొద్దున ఆరు గంటల నుంచి పది గంటల వరకు అన్ని రకాల వ్యాపారాలు, కార్యక్రమాలకు అనుమతించింది. ఏ అవసరం ఉన్న వారికైనా ఈ సమయం సరిపోతుంది. ప్రభుత్వం పెద్ద లక్ష్యంతో లాక్డౌన్ను అమలు చేస్తున్నది. పోలీసులు, అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా కొంద రు ఏదో అవసరం పేరుతో రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు అడ్డుకుని హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మోటర్ సైకిళ్లపై ఇద్దరు, ముగ్గురు చొప్పున రోడ్లపై తిరుగుతున్నారు. లాక్డౌన్ మినహాయింపు సమయంలోనే అన్నీ సమకూర్చుకునే అవకాశము న్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హాస్పిటళ్లు, మందుల పేరిట కొందరు ఊరికే బయటికి వస్తున్నారు. చెక్ పోస్టుల దగ్గర అడిగితే సమాధానం దాటవేస్తున్నారు. ఇలాంటి వారితో నిజంగా అత్యవసరంపై బయటికి వచ్చే వారికి ఇబ్బంది కలుగుతున్నది.