హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఫస్టియర్లో పొందిన మార్కులనే సెకండియర్లోనూ కేటాయించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా బుధవారం విధివిధానాలను ఖరారుచేశారు. వీటి ప్రకారం ఫలితాలు ప్రకటించాలని ఇంటర్బోర్డు కార్యదర్శిని ఆదేశిస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా శుక్రవారం లేదా శనివారం ఫలితాలను విడుదలచేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు.