పాలకుడికి ముందుచూపు ఉండాలి.. ప్రజల రేపటి అవసరాలు ఎలా ఉంటాయో ఇవాళే కనిపెట్టాలి.. భవిష్యత్తు విపత్తులను వర్తమానంలోనే గుర్తించాలి. అంతకు మించి ప్రజలందరికీ మంచి చేయాలన్న సంకల్పం ఉండాలి. తెలంగాణలో ఇప్పుడు అదే సంకల్పం కొనసాగుతున్నది. అన్నిరంగాల్లోనూ ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ఇప్పుడు కరోనా నియంత్రణలోనూ దేశానికి దారి చూపుతున్నది. కొవిడ్ కట్టడిలో తెలంగాణ ఇప్పటికే అనుసరిస్తున్న పలు విధానాలను దేశమంతా చేపట్టాలని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో రాష్ర్టాలకు సూచించింది.
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు కొవిడ్ కట్టడిలోనూ దిక్సూచిగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఈ నెల 4 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్రప్రభుత్వం అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. కరోనాను ముందుగానే గుర్తించి, కట్టడిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 27 వేల ఆరోగ్య బృందాలు ఇంటింటికీ తిరిగి ప్రజలందరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొంటున్నాయి. జ్వరం, జలుబులాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మెడికల్ కిట్ ఇచ్చి, వారు ఇంటినుంచి బయటకు రాకుండా చర్యలు చేపడుతున్నాయి. కోటికిపైగా కుటుంబాలున్న రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 75 లక్షల కుటుంబాలను వైద్య బృందాలు స్వయంగా కలిశాయి. దాంతో రాష్ట్రంలో కొవిడ్ కేసులు వేగంగా తగ్గుతున్నాయి. ఇదే విధానాన్ని అనుసరిస్తూ సర్వేలో స్వల్ప లక్షణాలు ఉన్నవారికి ప్రాథమిక మెడికల్ కిట్ను అందజేయాలని కేంద్రం పేర్కొన్నది.
కరోనా కట్టడిపై ఇటీవల అన్ని రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు, రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వే గురించి కూలంకషంగా వివరించారు. లక్షణాలున్నవారికి ఇస్తున్న కిట్లు, వాళ్ల ఆరోగ్యంపై మానిటరింగ్ చేస్తున్న విధానం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న తీరు, ఇప్పటివరకు సర్వేచేసిన ఇండ్ల సంఖ్య, సర్వేతో వస్తున్న ఫలితాలను సమీక్షలో హరీశ్రావు విపులంగా వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చిన హర్షవర్ధన్, సీఎం కేసీఆర్ మీ ద్వారా చేసిన సూచనలు, సలహాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని సమీక్షలోనే చెప్పారు. హరీశ్రావు సర్వే గురించి చెప్పిన ప్రతి విషయాన్ని స్వయంగా నోట్ చేసుకొని ప్రధానికి వివరించారు. వెంటనే కోర్కమిటీతో సమావేశమైన మోదీ, కరోనా కట్టడికి తెలంగాణలో అమలుచేస్తున్న విధానాలు బాగున్నాయని, దేశవ్యాప్తంగా వాటినే అమలుచేయాలని అన్ని రాష్ర్టాలను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ఆరోగ్య సర్వేతోపాటు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ తెలంగాణలో నిర్వహిస్తున్నట్టే యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం పేర్కొన్నది. పాజిటివ్ లక్షణాలు ఉన్నవారి ప్రాథమిక కాంటాక్ట్లను ఆశ వర్కర్ల ద్వారా గుర్తించాలన్న కేంద్రం మార్గదర్శకం కూడా తెలంగాణలో ఇప్పటికే అమలవుతున్నది. లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని తెలంగాణలో ఇంట్లోనే ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్న విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని పేర్కొనడం విశేషం. దీంతో తెలంగాణ దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. మనం అమలు చేస్తున్న వాటినే ఇతర రాష్ర్టాలు అనుసరించాలని చెప్పడం.. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం అన్నిరాష్ర్టాలకంటే ముందుందని కేంద్రం చెప్పకనే చెప్పినైట్టెంది.