న్యూఢిల్లీ, మే 5: దేశంలో కరోనా థర్డ్వేవ్ తప్పదని, అయితే అది ఎప్పటి నుంచి ఎప్పటివరకు కొనసాగుతుందనేది చెప్పలేమని కేంద్రప్రభుత్వం పేర్కొన్నది. తదుపరి వేవ్లకు సిద్ధంగా ఉండాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్వేవ్ ఇంత మహోగ్రంగా ఉంటుందని ఊహించలేదని తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ సహా పన్నెండు రాష్ర్టాల్లో యాక్టివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయని వెల్లడించింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, బీహార్లలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయని తెలిపింది. 24 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 15 శాతం కంటే ఎక్కువగా ఉన్నదని వెల్లడించింది. ఈ నెల 1 నుంచి 18-44 ఏండ్ల క్యాటగిరీకి చెందిన 6.71 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపింది. ‘థర్డ్వేవ్ అనివార్యం. అయితే అది ఎప్పుడన్నది స్పష్టతలేదు. కొత్తవేవ్లకు మనం సిద్ధంగా ఉండాలి’ అని కేంద్రప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కే విజయ్ రాఘవన్ పేర్కొన్నారు. కరోనాబారిన పడిన వారికి టెలీకన్సల్టేషన్ సేవలు అందించేందుకు వైద్యులు ముందుకు రావాలని నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ విజ్ఞప్తిచేశారు. జంతువుల ద్వారా వైరస్ వ్యాప్తిచెందట్లేదని, మనుషుల నుంచి మనుషులకే వ్యాపిస్తున్నదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విదేశాల నుంచి అందుతున్న సాయాన్ని సీనియర్ అధికారుల బృందం పర్యవేక్షిస్తున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గత రెండువారాలుగా మహారాష్ట్రలోని 11 జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, సోలాపూర్ వంటి కొన్ని జిల్లాల్లో పెరుగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.
డబుల్ మ్యుటెంట్, బ్రిటన్ రకం వైరస్లపై వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నప్పటికీ.. వైరస్ తరచూ ఉత్పరివర్తనం చెందుతున్న నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరమని రాఘవన్ పేర్కొన్నారు. రెండోవేవ్కు చాలా కారణాలు ఉన్నాయని, అందులో వేరియంట్లు ఒక కారణమని చెప్పారు. ఫస్ట్వేవ్ తగ్గడానికి ప్రధానంగా రెండు కారణాలని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి పెరుగడంతో ప్రజల్లో రోగనిరోధకశక్తి పెరిగిందని, అలాగే కరోనా మార్గదర్శకాలు పాటించడంతో కేసులు దిగివచ్చాయని చెప్పారు. అయితే నియంత్రణ చర్యలు తగ్గడంతో వైరస్ వ్యాప్తి పెరిగిందని, ప్రజల్లో ఉన్న రోగనిరోధక స్థాయి కూడా ఒక్కోసారి వైరస్ వ్యాప్తి కట్టడికి సరిపోదని అభిప్రాయపడ్డారు. సెరోపాజిటివ్ వ్యక్తుల్లో తగినన్ని యాంటీబాడీలు లేకపోవడమే వైరస్ మళ్లీ విజృంభణకు కారణమని ఓ అధ్యయనంలో తేలిందన్నారు.
దేశంలో రాబోయే రోజుల్లో మరణాలు రెట్టింపయ్యే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరించారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే, జూన్ 11నాటికల్లా కరోనా మరణాలు 4,04,000కి చేరవచ్చని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు అంచనావేశారు. వర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్’ అంచనాను బట్టి భారత్లో జూలై చివరినాటికి మరణాలు 10 లక్షలు దాటనున్నాయి.