తిరువనంతపురం: కేరళలో మరో జికా వైరస్ కేసు నమోదయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జికా బాధితుల సంఖ్య 15కు చేరింది. నంతన్కోడ్కు చెందిన ఓ 40 ఏండ్ల వ్యక్తిలో లక్షణాలు కనిపించడంతో అతని నుంచి నమూనాలు సేకరించామని, అల్లాపూజాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అందులో అతనికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. మిగిలిన 14 మంది తిరువనంతపురానికి చెందినవారని వెల్లడించారు.
తిరువనంతపురంలో జికా వైరస్ లక్షణాలు ఉన్న 17 మంది నమూనాలను పరీక్షించగా అందులో 14 మందికి పాజిటివ్ అని తేలింది. జికా వైరస్ ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాపిస్తుంది. 1947లో కోతుల్లో మొదటిసారి గుర్తించారు. 1952లో ఉగాండాలో మనుషుల్లో గుర్తించారు. జికా సోకితే జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. ఇది ప్రాణాంతకం కాకపోయినా గర్భిణులకు సోకితే పుట్టే బిడ్డ ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశాలు ఎక్కువ.