హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విచారణకు డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హారజయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేసింది.
మాస్కు ధరించని వారి వాహనాలను జప్తు చేసే అంశాన్ని పరిశీలించాలని పోలీసు శాఖకు సూచించింది. ఔషధాల అక్రమ విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. ఫంక్షన్ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది.
‘‘వారాంతపు లాక్డౌన్ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపు ప్రతిపాదనను పరిశీలించాలి. ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స, ఔషధాల గరిష్ఠ ధరలు ప్రభుత్వం నిర్ణయించాలి. ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ చికిత్సపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలి. కరోనా పరీక్షలు తగ్గించొద్దు.. రోజుకు లక్షకుపైగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
సంచార వ్యానుల ద్వారా ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలి. ఖైదీలు నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారో స్పష్టం చేయాలి. రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిపుణల కమిటీ సమావేశాల వివరాలు సమర్పించాలి. శ్మశాన వాటికల్లో సదుపాయాల వివరాలు తెలపాలి. శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దు. వివాహాలు, అంత్యక్రియల ఆంక్షలపై వెంటనే జీవో ఇవ్వాలి’’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీలో టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలుపగా.. వారంలోగా అన్ని జిల్లాల్లో టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆక్సిజన్ రాకుండా తమిళనాడు అడ్డుకుంటోందని డీహెచ్ హైకోర్టుకు తెలుపగా.. వెంటనే ఇతర రాష్ట్రాల నుంచి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్టు కోరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.