సీడీఎఫ్ @ రూ.5కోట్లు
ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కేటాయింపులు
అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఆరంభం
మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
వికారాబాద్ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు,ఆరుగురు ఎమ్మెల్సీలు
అంతకుముందు ఒక్కొక్కరికి రూ.3 కోట్లు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు
వికారాబాద్,మార్చి 3, (నమస్తే తెలంగాణ):కొవిడ్-19తో గతేడాది నిలిచిపోయిన అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీఎఫ్)ను మళ్లీ ఆరంభించారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.800 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. వికారాబాద్ జిల్లాలో తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రధానంగా పల్లెల్లో అంతర్గత రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు ఉపయోగించాలి. నలుగురు ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.20 కోట్లు రానున్నాయి. ఎమ్మెల్సీలకు సంబంధించి రూ.30 కోట్లు రానున్నాయి. గతంలో రూ.3 కోట్లు కేటాయిస్తుండగా.. తాజాగా రూ.5 కోట్లకు ప్రభుత్వం పెంచడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కొవిడ్-19తో గతేడాది నిలిచిపోయిన అసెంబ్లీ నియోకవర్గ అభివృద్ధి నిధులు(సీడీఎఫ్) మళ్లీ ఆరంభించారు. నిధులు రాకపోవడంతో ఎమ్మెల్యేలు కొంత ఇబ్బంది పడ్డారు. సీడీఎఫ్ నిధులకు మోక్షం కలగడంతో ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఎమ్మెల్యేలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.800కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం వీటిని మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. వికారాబాద్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి అసెంబ్లీ స్థానాలుండగా..ఎమ్మెల్సీగా జిల్లాకు చెందిన పట్నం మహేందర్రెడ్డి కొనసాగుతున్నారు.
సీపీవో కార్యాలయానికి అందిన ఆదేశాలు..
రాష్ట్ర బడ్జెట్లో ఈ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాల వారీగా ముఖ్యప్రణాళిక అధికారి (సీపీవో)కార్యాలయాలకు అందాయి. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఆర్థిక సంవత్సరానికి రూ.5కోట్లు కేటాయించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు ఆర్జీలు వస్తుంటాయి. సదరు పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. సీడీఎఫ్ నిధుల మంజూరుతో క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధి పర్యటించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం అనుమతి లేకుండానే సీడీఎఫ్ నిధులను కేటాయించ్చవచ్చు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిధులపై ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రధానంగా పల్లెలో అంతర్గత రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం ఉపయోగించాలి. మతపరమైన వాటికి నిధులను వాడరాదు. అభివృద్ధి పనుల అంచనా విలువ రూ.5లక్షలు దాటితే తప్పనిసరి టెండర్ నిర్వహించాల్సి ఉంటుంది. అంతకులోపు ఉంటే నామినేషన్పై పనులు అప్పగిస్తారు.
ప్రయోజనం ఇలా..
వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు అసెంబ్లీ స్థానాలున్నాయి. జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీలు ఉన్నారు. వారు రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పటికీ వికారాబాద్ జిల్లాకు నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు రూ.5 కోట్ల చొప్పున మొత్తం జిల్లాకు రూ.20కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి రానున్నాయి. ఎమ్మెల్సీలకు సంబంధించి రూ.30కోట్లు రానున్నాయి. అవి కూడా జిల్లాకు కేటాయించే అవకాశాలున్నాయి. గతంలో రూ.3కోట్లు ఆర్థిక సంవత్సరానికి కేటాయిస్తుండగా..తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను రూ.5కోట్లకు పెంచడంపై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నిధులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయినట్లు వికారాబాద్ సీపీవో మోహన్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
మంజూరు ఇలా..
పనులకు సంబంధించి ముఖ్యప్రణాళిక అధికారి నుంచి పరిపాలన ఆమోదం లభించాలి. పని పూర్తయిన తర్వాత క్వాలిటీసెల్ (క్యూసీ)రిపోర్టు తీసుకుని సీపీవో నుంచి డబ్బులు రిలీజ్ చేస్తారు. క్యూసీ రిపోర్టు ఆలస్యమైతే అంచనా విలువలో 5శాతం నిలుపుదల చేసి మిగతా నిధులు విడుదల చేస్తారు. క్యూసీ వచ్చిన పక్షంలో నిలుపుదల చేసిన నిధులను కూడా విడుదల చేస్తారు.
రెండేండ్ల తర్వాత వస్తున్నాయి
రెండేండ్ల తర్వాత అసెంబ్లీ నియోకవర్గ అభివృద్ధి నిధులు రావడం మంచి పరిణామం. నా నియోజకవర్గంలో 132 పంచాయతీలు, 34 వార్డున్నాయి. నిధులు కేటాయింపులు చేసి మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలుంటుంది. నా హయాంలో మొదటి సారి సీడీఎఫ్ నిధులు వస్తున్నాయి. కరోనా కష్టకాలంలో సైతం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్, ఎమ్మెల్యే
మరింత అభివృద్ధికి అవకాశం
నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేయడం ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. సీడీఎఫ్ నిధులను రూ.3 కోట్లు నుంచి రూ.5కోట్లకు పెంచడం ద్వారా మరింత అభివృద్ది పనులు చేపట్టడానికి అవకాశం ఏర్పడింది. ప్రాధాన్యతా క్రమంలో గ్రామాల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించడంతో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి.
–కొప్పుల మహేశ్రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి
ఇవి కూడా చదవండి
6న బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
శిల్ప కళా వేదిక దగ్గర పవన్ ఫ్యాన్స్ సందోహం.. పాసులు లేకపోతే అంతే..
ఆన్లైన్లో ఫేస్బుక్ యూజర్ల డేటా!
కరోనా కట్టడి.. పంచ సూత్రాలతోనే సాధ్యం: మోదీ