l ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్లు
l ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు
మొత్తం ఓటర్లు 11,26,221 పురుషులు 5,53,862 మహిళలు 5,72,121 ఇతరులు 236
దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు
కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం
రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలు
టీఆర్ఎస్, ఏఐఎంఐఎం,టీడీపీ, వైఎస్సార్సీపీ
రిజిస్టర్ అయిన పార్టీలకు 49, స్వతంత్రుల కోసం 50 గుర్తులు కేటాయింపు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మినీ పుర పోరుకు తెర లేచింది. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయడంతో తెలంగాణలో మినీ పుర పోరు మొదలైంది. వీటితో పాటు జీహెచ్ఎంసీలోని ఒక డివిజన్కు, పలు మున్సిపాలిటీల్లోని 8 వార్డుల ఉప ఎన్నికలకు కూడా ఇదే షెడ్యూల్లో నోటిఫికేషన్ విడుదలైంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటితోపాటు గజ్వేల్ మున్సిపాలిటీలో 12వ వార్డు, నల్లగొండలో 26వ వార్డు, జల్పల్లిలో 28వ వార్డు, అలంపూర్లో 5వ వార్డు, బోధన్లో 18వ వార్డు, పరకాలలో 9వ వార్డు, మెట్పల్లిలో 8వ వార్డు, బెల్లంపల్లిలో 30వ వార్డుకు కూడా ఎన్నికలు జరుగుతాయి. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై 20వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి, 21వ తేదీన పరిష్కరిస్తారు. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. వారికి గుర్తులను కేటాయిస్తారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనివార్య కారణాల వల్ల అవసరమైతే మే 2న రీపోలింగ్ నిర్వహిస్తారు. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెకించి, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ (18వ డివిజన్) ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదలచేసింది. శుక్రవారం నుంచి 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి, గుర్తులు కేటాయిస్తారు. 30న పోలింగ్, మే 2న అవసరమైన చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తారు. మే 3న ఓట్లు లెక్కించి, ఫలితాన్ని ప్రకటిస్తారు.
సిద్దిపేట పాలకమండలి పదవీకాలం గురువారంతో పూర్తయింది. మార్చి 15వ తేదీ నాటికి అచ్చంపేట పాలకవర్గం పదవీకాలం పూర్తయింది. జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. గురువారం ఉదయం వార్డులవారీ రిజర్వేషన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.
ఎన్నికలు జరిగే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో 11,26,221 మంది ఓటర్లున్నారు. వీరిలో 5,53,862 మంది పురుషులు, 5,72,121 మంది మహిళలు, 236 మంది ఇతరులున్నారు.
మొత్తం వార్డులు 248 కాగా, పోలింగ్ కేంద్రాలు 1,532, బ్యాలెట్ బాక్స్లు 2,479 ఏర్పాటుచేశారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం 1,203 మంది రిటర్నింగ్ అధికారులు, 203 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది 6,070, ఓట్ల లెక్కింపు సిబ్బంది 1,555, జోనల్ అధికారులు 97 మంది, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 33, సర్వేలెన్స్ బృందాలు 22, సాధారణ పరిశీలకులు 8 మంది, ఎన్నికల వ్యయం పరిశీలకులు 10 మంది, అదనపు వ్యయ పరిశీలకులు 20 మందిని ఎన్నికల సంఘం నియమించింది.
నామినేషన్ డిపాజిట్ జనరల్ అభ్యర్థులు కార్పొరేషన్లలో రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500, మున్సిపాలిటీల్లో జనరల్ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1,250.
గ్రేటర్ హైదరాబాద్లో వార్డు సభ్యులు రూ.5 లక్షలు, ఇతర కార్పొరేషన్లలో రూ.1.50 లక్షలు, మున్సిపాలిటీలలో వార్డు సభ్యులకు రూ.లక్ష వరకు వ్యయం చేయడానికి ఎన్నికల సంఘం పరిమితి విధించింది. ఎన్నికల ఖర్చులను ప్రత్యేక బ్యాంక్ ఖాతా ద్వారా చేయాలని తెలిపింది. సంబంధిత అకౌంట్ నంబర్ను రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రంలోనే తెలియజేయాలని స్పష్టం చేసింది.
దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.