హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): గొప్ప వారసత్వ, సాంస్కృతిక సంపద, వైవిధ్యభరితమైన పర్యాటక ప్రాం తాలతో తెలంగాణ ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారుతున్నదని సోషియో ఎకనమిక్ సర్వే స్పష్టం చేసింది. వారసత్వ కట్టడాలైన కాకతీయ ఖిల, రామప్ప, వెయ్యి స్తంభాల దేవాలయాలు, చార్మినార్, గోల్కొండ కోట, ఫలక్నుమా ప్యాలెస్, హుస్సేన్సాగర్ సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం రా మాలయం, జోగులాంబ దేవాలయం, కొలనుపాక జైన్ టెం పుల్, మక్కామసీదు, మెదక్ చర్చి తదితర ప్రదేశాలకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటున్నదని పేర్కొంది.
తెలంగాణలో 2026 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తుందని సామాజిక ఆర్థిక సర్వే అంచనావేసింది. ప్రస్తుతం పట్టణాల్లో 38.9శాతం జనాభా నివసిస్తున్నారని తెలిపింది. తెలంగాణలో పట్టణీకరణ అత్యంత వేగంగా జరుగుతున్నదని పేర్కొంది. రాష్ట్ర అభివృద్ధిలో పట్టణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. హైదరాబాద్ నగరం దేశంలోనే అత్యంత అనుకూల నివాసయోగ్యమైన నగరంగా, ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందిందని పేర్కొంది. ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపింది. 2036 నాటికి తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో జనాభా 57.3 శాతానికి చేరుకుంటుందని, అదే సమయంలో దేశంలో 39.6 శాతం ఉంటుందని పేర్కొంది.