హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ‘ఆదాయం పెంచాలి – ప్రజలకు పంచాలి’.. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటినుంచీ అనుసరిస్తున్న సూత్రం. ఈ క్రమంలోనే ఏడేండ్లుగా ఓవైపు రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచుతూ.. మరోవైపు వచ్చిన ప్రతి పైసాను సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల రూపంలో ప్రజలకు పంచుతున్నది. ఆసరా పెన్షన్లు మొదలు అన్నివర్గాల ప్రజలను ఆదుకునేలా చేపట్టిన కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం. తాజాగా దళిత బంధు పథకం అమలు, 57 ఏండ్లకు పెన్షన్ ప్రత్యక్ష ఉదాహరణ. వాస్తవానికి కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది మార్చి నుంచి రాష్ట్ర ఆదాయం ఒడిదుడుకులకు గురవుతున్నది. అయినా వెంటనే కోలుకుంటున్నది. ఈ ఏడాది సైతం సెకండ్ వేవ్ దెబ్బకొట్టింది.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మే 12వ తేదీ నుంచి లాక్డౌన్ విధించింది. ఇది నెలాఖరు వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. జూన్ నెలలో తిరిగి ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో రాష్ర్టానికి అన్ని మార్గాల్లో కలిపి సుమారు రూ. 24,600 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇందులో జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ వంటి పన్నులతోపాటు కేంద్ర పన్నుల్లో వాటా కూడా ఉన్నది. లాక్డౌన్తో మే నెల ఆదాయంలో 80 శాతానికిపైగా కోతపడింది. జూన్లో ఆర్థికవ్యవస్థ తిరిగి పట్టాలెక్కింది. ఆ నెలలో ఆదాయం రూ.10 వేల కోట్లు దాటిందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇంత ఆదాయం రావడం ఇదే మొదటిసారని అంటున్నారు. జూలై నెలలోనూ ఇదే ఒరవడి కొనసాగినట్టు సమాచారం. రాష్ట్రం రుణాల రూపంలో మరో రూ.12వేల కోట్లు సేకరించింది.
పైసలన్నీ ప్రజాసంక్షేమానికే జూన్, జూలై నెలల్లో ఆర్థికవ్యవస్థ తిరిగి గాడిన పడటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంక్షేమ పథకాల అమలుపై దృష్టిసారించారు.
వాస్తవానికి రాష్ట్ర ఆదాయం పెరుగగానే ప్రజలకు పంచడం ఇది కొత్తేం కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేళ్వరం సహా పలు ప్రాజెక్టులు చేపట్టి, అనేకరంగ్లాలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. మరోవైపు వచ్చిన ఆదాయాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, గొర్రెల పంపకం, ఇతర సబ్సిడీ పథకాల రూపంలో ప్రజలకు పంచింది. గతేడాది మొదటి వేవ్ సమయంలోనూ లాక్డౌన్తో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఆ సమయంలోనూ సంక్షేమ పథకాలను ఆపలేదు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కలిపి పింఛన్లు, రైతుబంధు, కరోనాసాయం రూపంలో రూ.15వేల కోట్లకుపైగా సంక్షేమానికి వెచ్చించింది. రెండు నెలల్లో ఆర్థికవ్యవస్థ గాడినపడగానే ఉద్యోగులకు వందశాతం జీతాలు అందజేశారు.